ఒమన్ సముద్రం మధ్యలో మంటల్లో దగ్దమైన ట్యాంకర్లు
గల్ఫ్ఆఫ్ ఒమన్లోని రెండు ఆయిల్ ట్యాంకర్లపై గురువారం అటాక్ జరిగింది. ఈ అటాక్లో రెండు ట్యాంకర్లు పూర్తిగా కాలిపోయాయని, దాంట్లో ఉన్న సిబ్బంది మాత్రం నీటిలోకి దూకి ప్రాణాలు కాపాడుకున్నారని అధికారులు చెప్పారు. యూఏఈకి చెందిన చమురు ట్యాంకర్పై దాడి జరిగిన నెల రోజుల్లోనే ఈ ఘటనలు జరగడం గమనార్హం. ఈ ప్రమాదం సంభవించటంతో చమురు ధరలు దాదాపు నాలుగు శాతం పెరిగాయి. ఇరాన్ దీన్ని ప్రమాదంగా చెప్పినప్పటికీ యూఎస్ మాత్రం దీన్ని అటాక్గా పేర్కొంది.
నార్వే ప్రభుత్వానికి చెందిన ఫ్రంట్ ఆల్టర్ నౌకపై ముందుగా దాడి జరిగిందనే వాదనలు వచ్చాయి. నౌకబోర్డులో మూడు పేలుళ్లు సంభవించాయని నార్వే మారీటైమ్ అథారిటీ చెప్పింది. తైవాన్ సీపీసీ కార్ప్కు 75,000 టన్నుల నాఫ్తాను రవాణా చేస్తున్న నౌకపై టార్పిడోతో దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. పనామా జెండాతో వస్తున్న కోకుకా నౌక మిథనాల్ను తీసుకెళ్తుండగా దాడి జరిగిందని, దీంతో పడవ మునిగిపోయే ప్రమాదం ఉందని నేవీ అధికారులు చెప్పారు. ఇరాన్కు 16 మైళ్ల దూరంలో, యూఏఈలోని పుజైరాకు 80 మైళ్ల దూరంలో ప్రమాదాలు జరిగాయన్నారు. కేవలం గంట వ్యవధిలోనే రెండు ఆయిల్ ట్యాంకర్లలో పేలుళ్లు సంభవించాయని ఇరాన్ మీడియా చెప్పింది.
ఈ దాడులు ఇరానీ నెవీనే చేసిందని యూఎస్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ జాన్ బోల్టన్ అన్నారు. దానికి సంబంధించి సాక్ష్యాలను సమర్పించేందుకు ఆయన తిరస్కరించారు. జపాన్ ప్రధాని షింజో అబే తమ సుప్రీం లీడర్ అయాతుల్లా ఖోమైనీతో భేటీ అయిన తర్వాత ఈ ఘటన జరిగిందని ఇరాన్ విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి చెప్పారు.