సిద్దిపేట, వెలుగు: ఇంతకుముందు సిటీలకే పరిమితమైన గన్కల్చర్ఇప్పుడు జిల్లాలకూ పాకుతోంది. భూముల రేట్లు అనూహ్యంగా పెరగడంతో రియల్ఎస్టేట్దందా జోరందుకుంది. భూవివాదాలు, ఆర్థిక లావాదేవీల్లో గొడవలు, సెటిల్మెంట్లు, దోపిడీలు సాధారణమయ్యాయి. దీంతో ప్రత్యర్ధులను బెదిరించడానికి.. అవసరమైతే అడ్డు తొలగించుకోవడానికి గన్స్వినియోగిస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో ఐదు నెలల్లో మూడుచోట్ల కాల్పులు జరిగాయి. ఈ ఘటనల్లో ఒకరు చనిపోగా.. మరొకరికి గాయాలయ్యాయి. గత నవంబర్ లో హైదరాబాద్కు చెందిన కొందరు యువకులు సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం సలాక్ పూర్ కు వేటాడేందుకు వచ్చారు. తాగిన మత్తులో ఎయిర్ గన్ తో సరదాగా జరిపిన కాల్పుల్లో ఒక యువకుడు చనిపోయాడు. జనవరి 31న సిద్దిపేట అర్బన్ సబ్రిజిస్ట్రార్ఆఫీసు దగ్గర నాటుతుపాకితో కాల్పులు జరిపి రూ. 42 లక్షలు దోచుకున్నారు. ఈ ఘటనలో డ్రైవర్గాయపడ్డాడు. జప్తిలింగారెడ్డిపల్లి దగ్గర పాతకక్షల కారణంగా తల్లీకొడుకులపై తుపాకీతో కాల్పులు జరిపారు.
కక్షలు తీర్చుకునేందుకు, సెటిల్మెంట్లకు..
కక్షలు తీర్చుకునేందుకు, సెటిల్మెంట్లలో ప్రత్యర్థులను బెదిరించేందుకు ఉత్తరాది రాష్ట్రాల నుంచి అక్రమంగా నాటు తుపాకులను కొనుక్కొస్తున్నారు. సిద్దిపేటలో తాజాగా జరిగిన రెండు కాల్పుల ఘటనల్లో వాడిన తుపాకులు అక్కడి నుంచి తెచ్చినవే. సిద్దిపేట రిజిస్ట్రేషన్ ఆఫీసు దగ్గర దోపిడీకి పాల్పడిన యువకులు మధ్యప్రదేశ్నుంచి రెండు గన్స్, బుల్లెట్స్కొనగా.. జప్తిలింగారెడ్డిపల్లి వద్ద వాడిన తుపాకీ, బుల్లెట్లను ఉత్తర ప్రదేశ్లో
రూ.50 వేలకు కొన్నారు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి చాలామంది జిల్లాకు వచ్చి వివిధ రంగాల్లో ఉపాధి పొందుతున్నారు. వీరిలో క్రిమినల్ రికార్డులున్న కొందరు నాటు తుపాకుల డీలింగ్లో స్థానికులకు సహకరిస్తున్నారు. ఆయా స్టేట్లలో నాటు తుపాకులు రూ.20 వేల నుంచి 50 వేలకే దొరుకుతున్నాయి.
జిల్లాలో 38 గన్స్కు లైసెన్స్లు
సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 38 గన్ లైసెన్స్లు ఉన్నట్టు సమాచారం. బ్యాంకుల దగ్గర సెక్యూరిటీ సిబ్బంది వెపన్స్కు ఇచ్చిన లైసెన్సులే ఎక్కువగా ఉన్నాయి. కొందరు లీడర్లు తమ ప్రాణాలకు ప్రమాదం ఉందన్న కారణంగా గన్ లైసెన్స్ లు తీసుకున్నారు. గన్ లైసెన్స్ల వివరాలను పోలీసులు గోప్యంగా వుంచుతున్నారు. ఇటీవల జరిగిన రెండు కాల్పుల ఘటనలతో జిల్లా పోలీసులు అక్రమ ఆయుధాల మీద దృష్టి పెట్టారు. అక్రమంగా ఎవరి దగ్గరన్నా వెపన్స్ఉన్నాయా అన్నది ఆరా తీస్తున్నారు. ఈ కేసుల దర్యాప్తు కోసం ఏర్పాటు చేసి స్పెషల్టీమ్ లు అక్రమ ఆయుధాలను వెలికితీసే పనిలో ఉన్నాయి.
రంగారెడ్డి జిల్లాలోనూ..
రియల్ ఎస్టేట్ వివాదాలతో ఈ నెల 2న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని కర్ణంగూడలో ఇద్దరు రియల్టర్లను ప్రత్యర్థులు కాల్చి చంపారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన శ్రీనివాస్రెడ్డి, రాఘవేందర్రెడ్డితో ప్రధాన నిందితుడైన మెరెడ్డి మట్టారెడ్డి అలియాస్ అశోక్రెడ్డికి భూతగాదాలున్నాయి. చర్ల పటేల్గూడెంలోని 369, 371, 372 సర్వే నంబర్లలోని15 ఎకరాల భూమికి సంబంధించిన వివాదాల వల్లే మట్టారెడ్డి జంట హత్యలు చేయించాడని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. ఈ కేసులో మట్టారెడ్డితో పాటు మరో ఐదుగురిని అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లాలో భూముల రేట్లు బాగా పెరగడం వల్లే రాఘవేందర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి లిటిగేషన్ భూములను కొనడం, సెటిల్మెంట్లు చేయడం పనిగా పెట్టుకున్నారు. ముఖ్యంగా శ్రీనివాస్రెడ్డి ఎల్బీనగర్లో చోటా నయీం పేరుతో భూదందాలు, రియల్ఎస్టేట్చేసేవాడని, ఈ క్రమంలోనే ప్రాణాలు పోగొట్టుకున్నాడని తెలుస్తోంది.
అక్రమంగా గన్స్ ఉంటే చర్యలు
అక్రమంగా ఆయుధాలు ఉన్నవాళ్లమీద కఠిన చర్యలు తీసుకుంటాం. లైసెన్స్ తుపాకీతో బెదిరింపులు, సెటిల్మెంట్లకు పాల్పడితే శిక్ష తప్పదు. అక్రమ ఆయుధాలు, బెదిరింపులకు సంబంధించిన సమాచారం తెలిస్తే పోలీసుల దృష్టికి తేవాలి. సమాచారం ఇచ్చినవారి వివరాలు సీక్రెట్గా ఉంచడమే కాకుండా పారితోషికం ఇస్తాం.
- ఎన్.శ్వేత, సిద్దిపేట సీపీ