ప్రజలతో బీఆర్ఎస్​కు గ్యాప్​ వచ్చింది : గుత్తా సుఖేందర్​రెడ్డి    

ప్రజలతో బీఆర్ఎస్​కు గ్యాప్​ వచ్చింది : గుత్తా సుఖేందర్​రెడ్డి    
  • దాన్ని పూడ్చుకోవడానికి ప్రయత్నించాలి
  • లీడర్ల మధ్య గ్యాప్​మంచిది కాదు
  • ఎంపీ టికెట్​ఇస్తే నా కొడుకు పోటీ చేస్తడు
  • పార్టీ మారుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్​

హైదరాబాద్, వెలుగు :  ప్రజలతో బీఆర్ఎస్​కు గ్యాప్​వచ్చిందని, దాన్ని ఎలా పూడ్చుకోవాలో చూసుకోవాలే తప్ప లీడర్ల మధ్య గ్యాప్​మంచిది కాదని శాసన మండలి చైర్మన్​గుత్తా సుఖేందర్​రెడ్డి అన్నారు. మంగళవారం కౌన్సిల్​లోని తన చాంబర్​లో మీడియాతో ఆయన చిట్​చాట్​చేశారు. మాజీ మంత్రి జగదీశ్​రెడ్డితో విభేదాలపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. పార్టీ కష్టకాలంలో ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో కేడర్​ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంటుందన్నారు. తన కుమారుడు అమిత్​రాజకీయాలకు కొత్త, ప్రజలకు పరిచయం లేదని చెప్తున్న వాళ్లు కూడా ఎమ్మెల్యేలు కాకముందు ఎవరికీ తెలియదన్నారు.

తాను బీఆర్ఎస్​అధిష్టానంపై నారాజ్ గా​ఉన్నానని, కాంగ్రెస్​కు దగ్గరవుతున్నానని సోషల్​మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అదే నిజమైతే తన కొడుకును బీఆర్ఎస్​నుంచి ఎందుకు ఎంపీగా పోటీ చేయించాలని అనుకుంటానని ఆయన ప్రశ్నించారు. నల్గొండ, భువనగిరి నియోజకవర్గాల్లో ఎక్కడి నుంచి అవకాశం ఇచ్చినా తన కొడుకు ఎంపీగా పోటీ చేస్తాడని తెలిపారు.

టికెట్​ఇవ్వకున్నా పార్టీ నిలబెట్టిన అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. తనను బుజ్జగించడానికి కేటీఆర్​తన ఇంటికి రాలేదని.. తానే కలవాలని అనుకుంటున్నానని చెప్తే ఆయనే వచ్చి కలిశారన్నారు. తన కారణంగానే నల్గొండలో ఒక్క సీటు మాత్రమే గెలిచారని కొందరు అంటున్నారని, ఖమ్మం, వరంగల్, మహబూబ్​నగర్​జిల్లాల్లో పార్టీ ఓటమికి కారణమెవరో చెప్పాలన్నారు.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉన్న రాజకీయ వాతావరణంతోనే ఓడిపోయామన్నారు. లోక్​సభ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికలకు రివర్స్​వేవ్​ఉండొచ్చని అన్నారు. అయోధ్య రామాలయ ప్రభావంతో బీజేపీకి తెలంగాణలో మూడు, నాలుగు శాతం ఓట్లు పెరగొచ్చని.. ఉత్తర తెలంగాణతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలో ఆ ప్రభావం ఎక్కువ ఉండొచ్చని అన్నారు.

బరిలో సోనియా ఉన్నా.. అమిత్​పోటీ చేస్తడు

శ్రీశైలం, నాగార్జున సాగర్​ప్రాజెక్టులు కేఆర్ఎంబీ పరిధిలోకి వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉందని గుత్తా సుఖేందర్​రెడ్డి అన్నారు. ఆ రెండు ప్రాజెక్టులు బోర్డు అధీనంలోకి వెళ్తే సాగునీటికే కాదు తాగునీటికీ ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. సాంకేతిక కారణాలతోనే ఎస్ఎల్బీసీ టన్నెల్​ప్రాజెక్టును బీఆర్ఎస్​ప్రభుత్వంలో పూర్తి చేయలేకపోయామన్నారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాకు నీళ్లిచ్చే ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్యత మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి తీసుకోవాలన్నారు. కౌన్సిల్ ను ఉద్దేశించి సీఎం రేవంత్​రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రివిలేజ్​కమిటీకి సిఫార్సు చేయాలని కోరారని, ఇంకా ప్రివిలేజ్​కమిటీని నియమించలేదని, నియమించగానే రెఫర్​చేస్తామన్నారు. బడ్జెట్​సమావేశాలను పాత అసెంబ్లీ బిల్డింగ్​లో నిర్వహించేలా రిపేర్లు చేపట్టారని తెలిపారు.

నల్గొండ నుంచి సోనియాగాంధీ పోటీ చేసినా ఆమెపై అమిత్​పోటీ చేస్తాడని గుత్తా స్పష్టం చేశారు. తాను రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నాను కాబట్టి రాజకీయాలకు అతీతంగానే వ్యవహరిస్తానన్నారు. తాగునీటి సమస్య తలెత్తకుండా ఆల్మట్టి నుంచి నీటిని విడుదల చేసేలా ప్రభుత్వం ప్రయత్నించాలన్నారు. శాసన మండలిలో ప్రతిపక్షానికే ఎక్కువ మంది సభ్యులున్నారని, ఈ పరిస్థితుల్లో అధికారపక్షం వ్యవహరించే తీరుపైనే ప్రతిపక్షం స్పందన ఉండొచ్చని తాను భావిస్తున్నానని తెలిపారు.