హైదరాబాద్, వెలుగు: గవర్నర్ పదవి రాజ్యాంగబద్ధమైంది, ఆ పోస్టులో ఉన్నోళ్లకు పరిధి ఉంటుందని, దాన్ని దాటి రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరికాదని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. గురువారం కౌన్సిల్ ఆవరణలోని తన చాంబర్లో మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు. దేశంలో సరైన ప్రత్యామ్నాయం లేకనే బీజేపీ ఆటలు సాగుతున్నాయని, కేంద్రంలో బలమైన నాయకత్వం అవసరం ఉందన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వకనే జీతాలు ఆలస్యమవుతున్నాయని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే అప్పులు చేస్తున్నామని తెలిపారు. రూ.4 లక్షల కోట్ల అప్పులకే గగ్గోలు పెట్టే నాయకులు మోడీ ప్రభుత్వం వంద లక్షల కోట్ల అప్పు చేస్తే ఆ మొత్తాన్ని ఎందుకు ఖర్చు చేశారో చెప్పాలన్నారు.
మునుగోడు, హుజూరాబాద్ రెండు వేర్వేరు
‘‘ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అంశం రాజగోపాల్ రెడ్డి పరిధిలోనే ఉంది. రాజీనామా అంశాన్ని సాగదీసే అవకాశం కనిపిస్తోంది. ఉప ఎన్నికకు కారణమైతే కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ మునుగుతరు. ఆయనకు అసంతృప్తి ఎందుకో ఆయనే సమాధానం చెప్పాలె, ఆయన్ను రాజీనామా చేయాలని ఎవరు కోరారు” అని గుత్తా ప్రశ్నించారు. హుజూరాబాద్, మునుగోడులో వేర్వేరు పరిస్థితులు ఉన్నాయని, అక్కడి రిజల్ట్ ఇక్కడ కూడా వస్తుందనుకోవడం అత్యాశేనన్నారు. రాజగోపాల్ రెడ్డి టీఆర్ఎస్లో చేరుతానన్న విషయం తనకు తెలియదన్నారు. ఎన్నికల సమయంలో లీడర్లు పార్టీలు మారడం సహజమేనన్నారు.