కరీంనగర్టౌన్, వెలుగు : అటెండెన్స్ లేదంటూ పీజీ థర్డ్ సెమిస్టర్ స్టూడెంట్లకు శాతవాహన వర్సిటీ ఆఫీసర్లు హాల్ టికెట్లు ఇవ్వకపోవడం వివాదాస్పదంగా మారింది. వర్సిటీ పరిధిలో పలు సబ్జెక్ట్ల సెమిస్టర్ ఎగ్జామ్స్ బుధవారం నుంచి ప్రారంభం అయ్యాయి. దీంతో స్టూడెంట్లు హాల్టికెట్ల కోసం మంగళవారం వర్సిటీ ఆఫీసర్ల వద్దకు వెళ్లారు. కానీ అటెండెన్స్ లేదంటూ 100 మంది స్టూడెంట్స్కు హాల్టికెట్ ఇచ్చేందుకు నిరాకరించారు.
బుధవారం మరోసారి అడిగినా ఇవ్వకపోవడంతో స్టూడెంట్లు ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, జిల్లా కార్యదర్శి మచ్చ రమేశ్ వర్సిటీకి చేరుకొని స్టూడెంట్లకు మద్దతు పలికారు. ఎగ్జామ్ ఫీజు తీసుకునే టైంలో అటెండెన్స్ గురించి సమాచారం ఇవ్వకుండా.. ఇప్పుడు హాల్టికెట్లు నిరాకరించడం సరికాదన్నారు. తర్వాత వర్సిటీ ఆఫీసర్లు కొందరితో లెటర్స్ రాయించుకొని హాల్టికెట్ ఇవ్వగా.. మరో 50 మందికి ఇవ్వకపోవడంతో వారు ఎగ్జామ్కు దూరమయ్యారు.
