
థియేటర్స్ లో సంచలన విజయం సాధించిన హనుమాన్(HanuMan) సినిమా అదే జోరును ఓటీటీలోను కొనసాగిస్తోంది. గత పదిహేను రోజులుగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై సస్పెన్స్ కొనసాగగా.. సడన్ గా మార్చ్ 17న జీ5లో ప్రత్యేక్షమైంది హనుమాన్ మూవీ. ఎలాంటి ప్రకటన లేకుండా డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల కావడంతో ఆడియన్స్ అవాక్కయ్యారు. దీంతో హనుమాన్ సినిమాను చూసేందుకు ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో విడుదలైన కొన్ని గంటల్లోనే రికార్డ్ వ్యూస్ సాధించింది హనుమాన్ మూవీ.
నిజానికి గత నెలరోజులుగా హనుమాన్ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దర్శకుడు ప్రశాంత్ కి కూడా సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేసుకున్నారు. ఆ మధ్య శివరాత్రి కానుకగా మార్చ్ 8న హనుమాన్ ఓటీటీకి వస్తుందని ప్రకటించి వాయిదా వేసేసరికి ఆడియన్స్ చాలా డిజిపోయింట్ అయ్యారు. ఇక అప్పటింనుండి నుండి ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై భారీ డిమాండ్ ఏర్పడింది. అలా అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో సడన్ గా ఓటీటీ దర్శనమిచ్చేసరికి ప్రేక్షకులు ఫుల్ హ్యాపీ గా ఫీలయ్యారు.
ఇక హనుమాన్ సినిమా విషయానికి వస్తే.. థియేటర్స్ లో ఈ సినిమా చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. చిన్న సినిమాగా సంక్రాంతి బరిలో దిగిన హనుమాన్ సంచలన విజయం సాధించింది. రోజురోజుకు పెరిగిన ప్రేక్షక ఆధారణతో అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఈ సినిమాలో క్లైమాక్స్ సీన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. నిజంగా హనుమంతులవారిని దర్శించుకున్న అనుభూతిని కలిగించాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ.
డివోషనల్ అండ్ సూపర్ హీరో కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసేసింది. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.330 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి భారీ విజయాన్ని సాధించింది. ఇక హనుమాన్ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు టాక్.