
న్యూఢిల్లీ: టీ20 వరల్డ్ కప్ ఘోర వైఫల్యాన్ని పాకిస్తాన్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. క్రికెటర్లపై డైరెక్ట్గా మాటల యుద్ధానికి దిగుతున్నారు. తాజాగా పేసర్ హారిస్ రవూఫ్కు ఓ అభిమానికి మధ్య జరిగిన గొడవ సోషల్ మీడియాను ఊపేసింది. ఫ్లోరిడాలోని హోటల్తో తన భార్యతో కలిసి రవూఫ్ నడుచుకుంటూ వెళ్తుండగా, కొంత మంది ఫ్యాన్స్ సెల్ఫీల కోసం రిక్వెస్ట్ చేశారు. ఈ క్రమంలో అక్కడున్న వారిలో ఒకరు రవూఫ్పై దూషణకు దిగాడు. దీంతో కోపంతో ఊగిపోయిన రవూఫ్.. భార్య వద్దని వారిస్తున్నా అభిమానిపైకి దూసుకెళ్లాడు. అతనితో తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగాడు. ‘నువ్వు ఇండియన్ అయి ఉంటావు’ అని రఫూఫ్ అంటే ‘నేను పాకిస్తానీనే’ అని ఆ అభిమాని బదులిచ్చాడు. ఈ వీడియో సంచలనంగా మారడంతో రవూఫ్ వివరణ ఇచ్చాడు. తన ఫ్యామిలీ జోలికి వస్తే ఎలాంటి వారినైనా వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశాడు.
గంభీర్ను ఇంటర్వ్యూ చేసిన సీఏసీ
న్యూఢిల్లీ: టీమిండియా హెడ్ కోచ్గా వచ్చేందుకు గౌతమ్ గంభీర్ తొలి అడుగు వేశాడు. ఈ మేరకు బీసీసీఐ క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) మంగళవారం గౌతీని ఇంటర్వ్యూ చేసింది. జూమ్ కాల్లో సీఏసీ చైర్మన్ ఆశోక్ మల్హోత్రా బృందం వివిధ రకాల ప్రశ్నలు అడిగింది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే కోచ్ పదవి రేస్లో ప్రధాన పోటీదారుడిగా ఉన్న గౌతీని రాబోయే 48 గంటల్లోనే అధికారికంగా ప్రకటించే చాన్స్ ఉంది. మూడు ఫార్మాట్లలో మూడు ఐసీసీ టోర్నీలు ఉండటంతో రాబోయే మూడేళ్లలో టీమిండియా రోడ్ మ్యాప్ ఎలా ఉండాలన్న దానిపైనే ఇంటర్వ్యూ జరిగిందని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. అయితే డబ్ల్యూవీ రామన్ను కూడా సీఏసీ ఇంటర్వ్యూకు హాజరైనట్లు సమాచారం. ఇక నార్త్ జోన్ సెలెక్టర్ పోస్ట్ కోసం కూడా కమిటీ కొంత మందిని ఇంటర్వ్యూ చేసింది.