- సగటున 6 నుంచి 8 నెలలకోసారి హెచ్వోడీలను మారుస్తున్నరు
- పెట్టుమన్న చోట సంతకాలు పెట్టనందుకే అధికారుల బదిలీలు
- కలెక్టర్లను ఒక జిల్లాలో కనీసం రెండేండ్లు ఉంచాలి.. అప్పుడే పట్టు వస్తది
- నియోపొలిస్లో రేవంత్ మేనల్లుడి అనుచరులకు అక్రమ మైనింగ్ అనుమతులు..
- మొబైల్క్రషర్ కు అనుమతిస్తే.. ఫిక్స్డ్ క్రషర్ పెట్టారని ఆరోపణ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పూటపూటకూ ఐఏఎస్, ఐపీఎస్లను మార్చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 5 సార్లు ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీలు చేపట్టారని తెలిపారు. సగటున 6 నుంచి 8 నెలలకోసారి హెచ్వోడీలను మారుస్తున్నారని, దీనివల్ల పాలన కుంటుపడుతున్నదని అన్నారు. రేవంత్కు రాష్ట్రాన్ని పాలించడం చేతకావడం లేదని విమర్శించారు. బుధవారం హైదరాబాద్లోని తెలంగాణభవన్లో హరీశ్రావు మీడియాతో చిట్చాట్ చేశారు.
విద్యుత్ శాఖలో రెండేండ్లలోనే ఐదుగురు అధికారులను మార్చడంతో.. ఆ శాఖ అతలాకుతలమైందని, అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. సింగరేణి, జీహెచ్ఎంసీ, ఐ అండ్ పీఆర్, స్కూల్ ఎడ్యుకేషన్, పంచాయతీరాజ్ శాఖల్లో నలుగురు చొప్పున అధికారులను బదిలీ చేశారని పేర్కొన్నారు. మున్సిపల్శాఖలో ఐదుగురిని, మైనింగ్లో ఆరుగురిని, ఐటీ, నేషనల్ హెల్త్ మిషన్లో ముగ్గురు చొప్పున అధికారులను ట్రాన్స్ఫర్ చేశారన్నారు.
అత్యంత కీలకమైన ఆరోగ్య శ్రీ విభాగంలో ఏకంగా 8 మందిని మార్చేశారని తెలిపారు. పెట్టుమన్న చోట సంతకాలు పెట్టనందుకు, ప్రభుత్వ అవినీతికి సహకరించనందుకే అధికారులను ఇష్టమొచ్చినట్టు ట్రాన్స్ఫర్ చేస్తున్నారని ఆరోపించారు. సీఎంకు నచ్చకపోయినా, మంత్రులకు నచ్చకపోయినా ట్రాన్స్ఫర్లు కామన్ అయిపోయాయన్నారు. కలెక్టర్లను సీఎం బ్లాక్మెయిల్ చేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని, తీరు మార్చుకోవాలని వ్యాఖ్యానించారు.
యంగ్ ఐఏఎస్ల స్థైర్యం దెబ్బతింటది
రెండేండ్లలో 140 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తే.. 20 మంది కలెక్టర్లను ట్రాన్స్ఫర్చేశారని హరీశ్రావు తెలిపారు. ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే ఇప్పటిదాకా నలుగురు కలెక్టర్లను మార్చారన్నారు. ‘‘ఇట్లా మార్చుకుంటూపోతే జిల్లాపైనా,ఆయా శాఖపైన అధికారులు అవగాహన ఎప్పుడు వస్తుంది.. పనులు ఎలా జరుగుతాయి? కలెక్టర్కు జిల్లాపై అవగాహన రావడానికే 6 నెలలు పడుతుంది. ఈ లోపే ఎంతోమంది కలెక్టర్లను ప్రభుత్వం మార్చేసింది. దీని వల్ల యువ కలెక్టర్ల నైతిక స్థైర్యం దెబ్బతింటుంది. కలెక్టర్లు కనీసం రెండేండ్లు ఒకేచోట ఉంటేనే మంచి ఫలితాలు వస్తాయి’’ అని తెలిపారు.
వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్లగచర్ల ఆందోళన సందర్భంగా అనేక హామీలు ఇచ్చారని, ఆ హామీలు అమలు చేయాల్సి వస్తుందని ఆయన్ను అక్కడి నుంచి బదిలీ చేశారన్నారు. సీఎస్కే బోలెడన్ని బాధ్యతలుంటాయని, అలాంటి అధికారికి ఐటీ సెక్రటరీగా బాధ్యతలు ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో అధికారులకు ఎక్స్టెన్షన్ ఇస్తే.. కాంగ్రెస్ నేతలు విమర్శలు చేశారని, కానీ, ఇప్పుడు ఆ కాంగ్రెస్ ప్రభుత్వమే వందలాది మంది అధికారులకు ఎక్స్టెన్షన్లు ఇస్తున్నదని విమర్శించారు.
నియోపొలిస్లో అక్రమ మైనింగ్
సీఎం రేవంత్ మేనల్లుడి మనుషులు నియోపొలిస్లో అక్రమ మైనింగ్చేస్తున్నారని హరీశ్రావు ఆరోపించారు. అక్కడ మొబైల్ క్రషింగ్ ప్లాంట్కు మాత్రమే అనుమతులిచ్చినా.. ఫిక్స్డ్ క్రషింగ్ప్లాంట్ పెట్టారన్నారు. ల్యాండ్ లీజుకిస్తే 6 నుంచి 7 శాతం వరకు ఫీజు కట్టాలని, కానీ, వాళ్లకు మాత్రం ఫ్రీగా కట్టబెట్టేశారని ఆరోపించారు. ‘‘పది ఎకరాలే ఇచ్చినా.. 15 ఎకరాల్లో మైనింగ్ చేస్తున్నారు. రెడీమిక్స్ ప్లాంట్కు అనుమతి లేకున్నా ఐదారు ప్లాంట్లు పెట్టి నడిపిస్తున్నారు.
పటాన్చెరు ఎమ్మెల్యే మైనింగ్కంపెనీకి పదింతల పెనాల్టీ వేశారని, మరి రేవంత్మేనల్లుడి క్రషర్ యూనిట్కూ పెనాల్టీ వేస్తారా?’’ అని ప్రశ్నించారు. మంత్రి పొంగులేటి సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్ అనుమతులు లేకుండా రాజేంద్రనగర్లో మైనింగ్ దందా నడుపుతున్నదని చెప్పారు.
