
- రేవంత్ మౌనం.. ఉత్తమ్వి ఉత్తుత్తి మాటలు
- కృష్ణా జలాల్లో దోపిడీకి పోతిరెడ్డిపాడు.. గోదావరి జలాల్లో దోపిడీకి జీబీ లింక్
- ఇద్దరు కేంద్రమంతులుండీ మాట్లాడడం లేదని విమర్శ
- బనకచర్ల ప్రాజెక్టుపై పవర్పాయింట్ ప్రజెంటేషన్
హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం నిధులు, నీళ్ల విషయంలో ఏపీకి దోచిపెడ్తున్నదని.. తెలంగాణకు గుండు సున్నా ఇస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. ‘‘నిధులు, నదులు ఏపీకి ఇస్తున్నది. తెలంగాణకు మాత్రం మూట సాయం లేదు.. మాటసాయమూ లేదు. కృష్ణా జలాల్లో దోపిడీకి పోతిరెడ్డిపాడును ఏపీ వాడుకుంటున్నట్టుగా.. గోదావరి జలాల దోపిడీకి బనకచర్ల ప్రాజెక్టును వాడుకుంటుంది” అని అన్నారు. ఏపీ చేపడుతున్న గోదావరి– బనకచర్ల (జీబీ) లింక్ ప్రాజెక్టుపై శనివారం తెలంగాణ భవన్లో హరీశ్రావు పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
‘‘ఏపీ ప్రభుత్వం వేగంగా బనకచర్ల ప్రాజెక్టును చేపడుతున్నా రాష్ట్ర సర్కారు మౌనంగా ఉంటున్నది. రేవంత్ రెడ్డి ఆ ప్రాజెక్టు గురించి కనీసం స్పందించడం లేదు. మంత్రి ఉత్తమ్ ఉత్తుత్తి మాటలు తప్ప చర్యలు లేవు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు బనకచర్ల ప్రాజెక్టుకు ఆర్థిక సాయం చేస్తున్నది. అందుకు నిబంధనలనూ మార్చేందుకు సిద్ధమైంది” అని హరీశ్ రావు విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం పైసా ఇవ్వలేదని, పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుకు కనీసం మాట సాయమూ చేయలేదని ఫైర్ అయ్యారు.
నోటీసులివ్వడంపైనే దృష్టి
ఏపీ అక్రమంగా కడుతున్న ప్రాజెక్టులను అడ్డుకునే చర్యలు తీసుకునే చిత్తశుద్ధి రేవంత్ సర్కారుకు లేదని హరీశ్ రావు విమర్శించారు. ‘‘ప్రతిపక్షాలను ఇరిటేట్ చేయాలనుకోవడం తప్ప.. ఇరిగేషన్పై ఈ సర్కార్కు దృష్టి లేదు. కేటీఆర్కు, బీఆర్ఎస్ నాయకులకు నోటీసులిచ్చి అక్రమ కేసులు పెట్టడంలోనే బిజీగా ఉన్నది” అని దుయ్యబట్టారు. కృష్ణా జలాలపై 66:34 నిష్పత్తిలో తీసుకునేలా తాత్కాలిక ఒప్పందం జరిగిందని, ఆ ఒప్పందానికి మించి ఏపీ నీటిని తీసుకెళ్తున్నా ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు గోదావరిలోనూ ద్రోహం తలపెట్టేందుకు ఏపీ సిద్ధమవుతున్నా రేవంత్ సర్కార్ స్పందించడం లేదన్నారు.
‘‘2 టీఎంసీల బాబ్లీ ప్రాజెక్టు కోసం మహారాష్ట్రపై చంద్రబాబు పెద్ద పోరాటం చేశారు.. ఇప్పుడు అదే చంద్రబాబు అంతకు వంద రెట్ల మేర 200 టీఎంసీల సామర్థ్యంతో బనకచర్ల కడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పోరాడడం లేదు. ఏపీ అడుగులకు రేవంత్ మడుగులు ఒత్తుతున్నడు. దోస్తానా కోసం రాష్ట్ర ప్రయోజనాలను రేవంత్ తాకట్టు పెడుతున్నడు” అని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు (కిషన్రెడ్డి, బండి సంజయ్) ఉన్నా రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై మాట్లాడడం లేదని మండిపడ్డారు. ‘‘ఇటీవల తిరుమల వెళ్లిన కేంద్ర మంత్రి బండి సంజయ్.. తెలంగాణకు ఇచ్చిన నిధుల కన్నా పది రెట్లు ఎక్కువగా ఏపీకి ఇచ్చినట్లు చెప్పారు.
కేంద్రంలో తన పరపతితో చంద్రబాబు పోలవరం నుంచి నీళ్లు మళ్లించి.. నదుల అనుసంధానం పేరుతో కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుంటున్నడు. అయినా కూడా రేవంత్ రెడ్డి, ఇద్దరు కేంద్ర మంత్రుల్లో కదలిక లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైన పోరాటం చేసినా బీఆర్ఎస్ కలిసి వస్తుంది” అని తెలిపారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి జీబీ లింక్కు వ్యతిరేకంగా తీర్మానం చేసి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం ముందుకు రాకపోతే ప్రజాపోరాటానికి బీఆర్ఎస్ సిద్ధమవుతుందన్నారు.
న్యాయపోరాటానికి శ్రీకారం చుట్టి సుప్రీంకోర్టుకూ వెళ్తామని తెలిపారు. ‘‘తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోలేదని చెబుతున్న చంద్రబాబు నాయుడే.. అడుగడుగునా ప్రాజెక్టులను అడ్డుకున్నడు’’ అని హరీశ్రావు దుయ్యబట్టారు. వీలైనంత త్వరగా కాళేశ్వరం ప్రాజెక్టుకు రిపేర్లు చేసి నీటి హక్కులను కాపాడాలన్నారు.
లేఖలు రాసి మీడియాకు ఇవ్వడం కాదు..
కాగా, ఏపీ కడుతున్న బనకచర్ల ప్రాజెక్టుపై తాను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చాక.. కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి ముందురోజే రాసినట్టుగా ఓ లేఖను మంత్రి ఉత్తమ్ విడుదల చేశారని హరీశ్ రావు తెలిపారు. లేఖలు రాసి మీడియాకు ఇవ్వడం కాదని, నిజంగా చిత్తశుద్ధి ఉంటే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ నిర్వహించేలా సీఎంను డిమాండ్ చేయమనాలని ఆయన అన్నారు.