కాంగ్రెస్​ గెలిస్తే ఎన్నెకరాలున్నా15 వేలే ఇస్తరు : హరీశ్ రావు

కాంగ్రెస్​ గెలిస్తే ఎన్నెకరాలున్నా15 వేలే ఇస్తరు :  హరీశ్ రావు

మెదక్/ పాపన్నపేట, వెలుగు: కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వస్తే ఎన్ని ఎకరాలు ఉన్నా రూ.15 వేలే ఇస్తారని ఆర్థిక మంత్రి హరీశ్ రావు  అన్నారు. బుధవారం మెదక్​ టౌన్​, రూరల్, హవేలి ఘనపూర్​ మండలాల బీఆర్​ఎస్​ కార్యకర్తల సమావేశం బుధవారం హవేలి ఘనపూర్ మండలం కుచన్​పల్లిలోని ఎమ్మెల్సీ శేరి సుభాష్​రెడ్డి ఫాంహౌజ్​ లో, అలాగే పాపన్నపేటమండలంలోని లక్ష్మీనగర్ ఎస్ ఆర్​ గార్డెన్ లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన  మాట్లాడారు.  

తెలంగాణాలోనే  మాత్రమే రైతులకు 24 గంటల కరెంట్ వస్తోందన్నారు.  కర్నాటకలో 5 గంటల కరెంట్ మాత్రమే ఇస్తున్నామని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెప్పిన  విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కర్నాటకలో రైతుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయ్యిందన్నారు.  ఛత్తీస్ గడ్ లోఎకరాకు 13 క్వింటాళ్ల వడ్లు మాత్రమే కొంటారని, మన రాష్ట్రంలో ప్రతి గింజ కొనుగోలు చేస్తున్నామన్నారు. మెదక్​ నుంచి ఆఫీసులు తరలింపు అనేది ఉత్తమాట అని, నాలుగు కొత్తవి తెస్తాం కానీ ఎందుకు వెళ్తాయన్నారు.  అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్​ ప్రభుత్వమేనని అన్నారు.

కేసీఆర్​ను మరోసారి సీఎంను చేద్దామన్నారు. పార్టీ తల్లి లాంటిదని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. పదేళ్ల కింద పాపన్నపేట ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉందో ఆలోచించాలన్నారు.  భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని  పద్మా దేవేందర్​ రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కు  చెందిన ప్రజాప్రతినిధులు మంత్రి సమక్షంలో పార్టీలో చేరారు.  మీటింగ్​లో ఇఫ్కో డైరెక్టర్​ దేవేందర్​ రెడ్డి, అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి,  కంఠారెడ్డి తిరుపతి రెడ్డి,   జడ్పీ వైస్ చైర్ పర్సన్  లావణ్య రెడ్డి,  ఏఎంసీ చైర్మన్ జగపతి, పీఏసీఎస్​ చైర్మన్ హన్మంత రెడ్డి, ఎంపీపీలు నారాయణరెడ్డి, యమున జయరాం రెడ్డి, నాయకులు  తదితరులు పాల్గొన్నారు.