మెదక్ టౌన్, వెలుగు: జిల్లాలో మత్తు పదార్థాలను నియంత్రించడంతో పాటు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో మత్తు పదార్థాల నిర్మూలన, రోడ్డు ప్రమాదాల నివారణపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి అవసరమైన హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లాలో డ్రగ్స్ వినియోగం, రవాణాను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఎస్పీలు ప్రసన్నకుమార్, నరేందర్గౌడ్ పాల్గొన్నారు.
