బెజ్జంకి, వెలుగు : ఆన్లైన్ జాబ్ పేరుతో సైబర్ మోసానికి గురైన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గూడెం గ్రామంలో శుక్రవారం జరిగింది. ఎస్సై తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం... గూడెం గ్రామానికి చెందిన తడవారి హృతిక్ రోషన్ (19) బీటెక్ పూర్తి చేశాడు. కొన్ని రోజులుగా ఇంటి వద్దే ఉంటున్న హృతిక్ రోషన్కు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేలా ఆన్లైన్ జాబ్ ఇప్పిస్తామని, ఇందుకు కొంత డబ్బు చెల్లించాలని చెప్పారు.
నిజమేనని హృతిక్ రోషన్ ఆన్లైన్ ద్వారా రూ. 30 వేలు పంపించాడు. తర్వాత ఎంతకూ జాబ్ ఇప్పించకపోవడంతో అనుమానం వచ్చి వారికి ఫోన్ చేయగా.. ఎలాంటి రెస్పాన్స్ లేదు. దీంతో మోసపోయానని గ్రహించిన హృతిక్ రోషన్ మనస్తాపంతో గురువారం రాత్రి పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు కరీంనగర్లోని గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించగా.. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ శుక్రవారం చనిపోయాడు. మృతుడి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
