కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ఇవ్వండి..ఫుల్ రిపోర్ట్ కావాలి:హరీష్ రావు

కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ఇవ్వండి..ఫుల్ రిపోర్ట్ కావాలి:హరీష్ రావు
  • 665 పేజీల ఫుల్ నివేదిక కావాలి
  • సీఎస్‌‌కు హరీశ్‌‌రావు విజ్ఞప్తి
  • కేసీఆర్, తన పేరుతో 
  • రెండు వేర్వేరు లేఖలు అందజేత 
  • కమిషన్‌‌ రిపోర్టుపై లీగల్‌‌గా ఫైట్​చేయాలనే యోచనలో బీఆర్ఎస్​ పెద్దలు 
  • ఇప్పటికే ఢిల్లీ వెళ్లి 
  • న్యాయ నిపుణులతో చర్చలు! 
  • నివేదికలో ఏముందో తెలుసుకుని సుప్రీంలో పిటిషన్ వేసేందుకు కసరత్తు

హైదరాబాద్, వెలుగు:కాళేశ్వరం జ్యుడీషియల్ ​కమిషన్​ రిపోర్టును తమకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్​రావు కోరారు. ఆయన శుక్రవారం సెక్రటేరియెట్‌‌లో సీఎస్‌‌ రామకృష్ణా రావును కలిశారు. కమిషన్ రిపోర్టు ఇవ్వాలని కోరుతూ కేసీఆర్, తన పేరుతో రెండు వేర్వేరు లేఖలను అందజేశారు. కమిషన్ 665 పేజీలతో ఇచ్చిన ఫుల్​ రిపోర్టును ఇవ్వాలని లేఖల్లో పేర్కొన్నట్టు తెలిసింది. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన సమ్మరైజ్డ్​రిపోర్టు కాకుండా.. కమిషన్ ఇచ్చిన ఒరిజినల్ రిపోర్టును ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్టు సమాచారం.

రిపోర్టులో తమ పేర్లు కూడా ఉన్నట్టు బయటకు చెబుతుండడంతో.. ఆ రిపోర్టులో ఏముందో తెలుసుకునే అవకాశం తమకివ్వాలని సీఎస్‌‌ను హరీశ్‌‌రావు కోరినట్టు తెలిసింది. అయితే ప్రభుత్వంతో సంప్రదించి నిర్ణయం చెబుతామని సీఎస్​చెప్పినట్టు సమాచారం. ప్రభుత్వ నిర్ణయం మేరకు రిపోర్టు ఇచ్చే విషయంపై డెసిషన్​తీసుకుంటామని స్పష్టం చేసినట్టు తెలిసింది. కాగా, లేఖలు ఇచ్చినట్టుగా సీఎస్​నుంచి హరీశ్ అక్నాలెడ్జ్‌‌మెంట్ తీసుకున్నారు. ఆయన వెంట పార్టీ ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, బండారు లక్ష్మారెడ్డి, ముఠా గోపాల్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్​తదితరులు ఉన్నారు. 

కేసీఆర్, హరీశే కారణమని తేల్చిన కమిషన్​

కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై జస్టిస్​పీసీ ఘోష్​ నేతృత్వంలోని జ్యుడీషియల్​కమిషన్​17 నెలల పాటు విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డ్యామేజీలపైనా జస్టిస్​ఘోష్​ విచారణ జరిపారు. అధికారులతో పాటు కేసీఆర్, హరీశ్​ రావు, ఈటల రాజేందర్ వాంగ్మూలాలను నమోదు చేశారు. 

వివిధ ఆధారాలనూ సేకరించారు. వాటన్నింటి ఆధారంగా మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి కారణం కేసీఆర్, హరీశ్​ రావులేనని రిపోర్టులో తేల్చి చెప్పారు. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల లొకేషన్లనూ మార్చేయడం వంటివన్నీ ఏకపక్ష నిర్ణయాలేనని స్పష్టం చేశారు. రిటైర్డ్​ఇంజనీర్ల కమిటీ రిపోర్టును తొక్కిపెట్టడం దగ్గర్నుంచి.. బ్యారేజీల అంచనాల పెంపు, చెల్లింపులు సహా అనేక అక్రమాలు జరిగాయంటూ రిపోర్టులో పేర్కొన్నారు. 

వాటన్నింటిపైనా కేబినెట్​ఆమోదం లేకుండానే అప్పటి సీఎం కేసీఆర్​ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారంటూ తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే దీనిపై లీగల్‌‌గా ముందుకు వెళ్లేందుకు.. అసలు రిపోర్టులో ఏముందో తెలుసుకునేందుకు పూర్తి రిపోర్టును బీఆర్ఎస్​పెద్దలు అడుగుతున్నట్టు తెలిసింది. ఆ రిపోర్టులోని అంశాలను బట్టి సుప్రీంకోర్టులో పిటిషన్​దాఖలు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.

నేరుగా సుప్రీంకోర్టుకు..   

కాళేశ్వరం జ్యుడీషియల్​ కమిషన్ ​రిపోర్టుపై లీగల్‌‌గానే ముందుకెళ్లాలని బీఆర్ఎస్ ​పెద్దలు నిర్ణయించినట్టు తెలుస్తున్నది. నేరుగా సుప్రీంకోర్టులోనే పిటిషన్ ​వేసేందుకు రెడీ అవుతున్నట్టు చర్చ జరుగుతున్నది. అందులో భాగంగా హరీశ్​రావు గురువారం హుటాహుటిన న్యాయవాదులతో కలిసి ఢిల్లీకి వెళ్లి పలువురు న్యాయ నిపుణులను కలిసినట్టు సమాచారం. 

వాస్తవానికి గురువారం సంగారెడ్డి కలెక్టరేట్​ఎదుట రైతు ధర్నాలో హరీశ్​ పాల్గొన్నారు. అయితే, కేసీఆర్ ​నుంచి ఫోన్​ రావడంతో ధర్నా మధ్యలోనే అక్కడి నుంచి ఆయన వెళ్లిపోయారు. ఎర్రవల్లిలోని ​ఫామ్‌‌హౌస్‌‌లో  కేసీఆర్‌‌‌‌తో సమావేశ మయ్యారు. అంతేగాకుండా గురువారం సాయంత్రం కేటీఆర్‌‌‌‌కు కూడా కేసీఆర్​ ఫోన్​ చేసి ఫామ్‌‌హౌస్‌‌కు పిలిపించుకున్నారు. 

ఇద్దరు నేతలతోనూ కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై కేసీఆర్​ చర్చించినట్టు తెలుస్తున్నది. కేసీఆర్​సూచనల మేరకు హరీశ్ ఢిల్లీ వెళ్లి అక్కడ న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది. వారిచ్చిన సూచనలతోనే కమిషన్ ​రిపోర్టును తమకు ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖలు రాశారని సమాచారం.