హైదరాబాద్, వెలుగు: టెట్ నిర్వహించి డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. టెట్ నిర్వహించకుండానే డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడంతో సుమారు 7 లక్షల మంది డీఎడ్, బీఎడ్ క్వాలిఫైడ్ నిరుద్యోగులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. ‘‘డిసెంబర్లో డీఎడ్, బీఎడ్ కోర్సులు పూర్తి చేసుకున్నోళ్లు దాదాపు 50 వేల మందికి పైగా ఉన్నారు. టెట్లో ఉత్తీర్ణత సాధించిన వారు మాత్రమే డీఎస్సీకి దరఖాస్తు చేయడానికి అర్హులవుతారనే విషయం మీకు తెలిసిందే.
గతేడాది సెప్టెంబర్లో బీఆర్ఎస్ ప్రభుత్వం టెట్ నిర్వహించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక టెట్ నిర్వహించలేదు. టెట్ కోసం దాదాపు 7 లక్షల మందికి పైగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి, డీఎస్సీ నోటిఫికేషన్ తో పాటు టెట్ నిర్వహించి విద్యార్థులు, నిరుద్యోగుల అవకాశాలు దెబ్బతినకుండా చూడాలని మనవి చేస్తున్నాను”అని సీఎంకు రాసిన లేఖలో హరీశ్ వివరించారు.