
గోదావరి జలాలను తరలించేందుకే ఏపీ బనకచర్ల ప్రాజెక్ట్ చేపడుతోందని ఆరోపించారు ఇరిగేషన్ మాజీ మినిస్టర్ హరీశ్ రావు . బనకచర్లపై పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇచ్చిన హరీశ్.. బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో ఏపీ ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తుంటే తెలంగాణ సర్కార్ ఏందుకు మౌనంగా ఉంటుందని ప్రశ్నించారు . బనకచర్లను ఏపీ నిర్మిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవడం లేదన్నారు. ప్రభుత్వ ధ్యాస కేటీఆర్, ప్రతిపక్ష నేతలపై ఎలా కేసులు పెట్టాలనే దానిపైనే ఉంది తప్ప రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు లేదన్నారు.
రానున్న రోజుల్లో బనకచర్ల సామర్థ్యం 400 టీఎంసీలకు పెంచుకునే కుట్ర చేస్తున్నారు . 200 టీఎంసీల నీళ్లను దోచుకోవడమే కాక భవిష్యత్తులో దాన్ని 400 టీఎంసీలకు పెంచుకుంటామని కేంద్రానికి సమర్పించిన నివేదికలో ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. అనాడు పోతిరెడ్డిపాడులో కూడా కుట్ర చేసి కృష్ణా నదిని కొల్లగొట్టారు.. ఇప్పుడు గోదావరికి కొల్లగొట్టే కుట్ర చేస్తున్నారు అని హరీష్ రావు అన్నారు
జీఆర్ఎంబీకి తెలంగాణ లేఖ
ఏపీ చేపడుతున్న గోదావరి బనకచర్ల (జీబీ) లింక్ ప్రాజెక్టును వెంటనే ఆపేయాలని, ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేశారని, ఇక ఏమాత్రం ఆలస్యం చేయవద్దని గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ)కు తెలంగాణ ఇప్పటికే లేఖ రాసింది. ఎప్పటినుంచో ఈ ప్రాజెక్టుపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ బోర్డుకు ఫిర్యాదు చేసినా చేష్టలుడిగి చూస్తున్నదని, డ్యూటీలో ఫెయిల్ అయ్యారని మండిపడింది. జీబీ లింక్ ప్రాజెక్ట్ తమ దృష్టికి రాలేదని ఓ పక్కన బోర్డు చెబుతున్నా.. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులపై ఏపీ శరవేగంగా ముందుకెళ్తోందని అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఈ మేరకు ప్రాజెక్టుపై వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తూ జీఆర్ఎంబీ చైర్మన్కు ఈఎన్సీ జనరల్ అనిల్ కుమార్ ఘాటు లేఖ రాశారు. గత మీటింగ్ లో అసలు ప్రాజెక్టు ప్రతిపాదనల దశలోనే ఉందని ఏపీ ఈఎన్సీ చెప్పారని, కానీ, ఏపీ ఇప్పటికే ప్రాజెక్టుకు సంబంధించి ప్రీ ఫీజిబిలిటీ స్టడీస్ పూర్తి చేసి రిపోర్ట్ సమర్పించేందుకు సిద్ధమైందనే వార్తలు వస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు. దీనిపై నీతి ఆయోగ్ మీటింగ్లోనూ చర్చించనున్నట్టు తెలిసిందని చెప్పారు. దాంతోపాటు ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న బొల్లాపల్లి రిజర్వాయర్తో ఏపీలోని పల్నాడు జిల్లాలో ముంపు గ్రామాలపైనా ఇప్పటికే సర్వే చేయించినట్టు తెలిసిందని తెలిపారు.
అలయ్ బలయ్ తో జల దోపిడి
కేసీఆర్ జగన్ తో అలయ్ బలయ్ చేసుకొని జల దోపిడీకి సహకరించారని మంత్రి ఉత్తమ్ విమర్శించారు. బనకచర్ల పై బీఆర్ఎస్ నేతలు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. బనకచర్ల అంతర్రాష్ట్ర జల విధానానికి విరుద్ధమని చెప్పారు. దీనిపై పోరాడుతామని స్పష్టం చేశారు. బనకచర్లతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జీఆర్ఎంబీ( గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డు), సీడబ్ల్యూసీ(కేంద్ర జలవనరుల సంఘం), అపెక్స్ కౌన్సిల్ నిబంధనలకు బనకచర్ల విరుద్ధమని అన్నారు. ఈ ప్రాజెక్టు ఆపాలని కేంద్ర మంత్రి నిర్మాలాసీతారామన్ కు, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ కు లేఖ రాసినట్టు చెప్పారు.