కాంగ్రెస్ పార్టీ సర్వే రిపోర్ట్లను బయట పెట్టాలి: హరివర్ధన్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ సర్వే రిపోర్ట్లను బయట పెట్టాలి: హరివర్ధన్ రెడ్డి

సికింద్రాబాద్ మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఆశావాహ అభ్యర్థి హరివర్ధన్ రెడ్డి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఆగ్రహం  వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైన నేపథ్యంలో సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి తనకు టికెట్ కేటాయించకపోవడంతో ఓల్డ్ బోయిన్ పల్లిలోని తన నివాసంలో మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు.

కాంగ్రెస్ పార్టీ హరివర్ధన్ రెడ్డికి అన్యాయం చేసిందని.. ఆయనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పార్టీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సర్వేల ఆధారంగా తనకే మొదటి స్థానం ఉన్నప్పటికీ బీసీల పేరుతో టికెట్టు ఇతరులకు కేటాయించడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ సర్వే రిపోర్ట్ లను బయట పెట్టాలని ఆయన అనుచరులు ప్లాకార్డులు ప్రదర్శించారు. 

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీని మాత్రం వీడే ప్రసక్తి లేదని.. పార్టీకి రాజీనామా చేస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ పునర్ వైభవం కోసం మేడ్చల్ జిల్లాలో పనిచేసిన తనకు కూకట్ పల్లి టికెట్ కేటాయిస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.