కోహినూర్పై హర్ష్ గోయెంకా ట్వీట్ వైరల్  

 కోహినూర్పై హర్ష్ గోయెంకా ట్వీట్  వైరల్  

న్యూఢిల్లీ: బ్రిటన్ ప్రధానిగా రిషి సునక్ నియామకం కావడంతో మాజీ క్రికెటర్ ఆశిశ్ నెహ్రా ట్రెండింగ్ లోకి వచ్చారు. ఇద్దరూ ఒకేలా ఉండడంతో వారిపై సోషల్ మీడియాలో మీమ్స్ పేలుతున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. బ్రిటన్​లో ఉన్న కోహినూర్ డైమండ్ ను తిరిగి ఇండియాకు తీసుకురావడానికి ఆయనొక ఐడియా చెప్పారు. కోహినూర్ ను తిరిగి తెచ్చేందుకు ఫ్రెండ్ ఇచ్చిన ఐడియా అంటూ దాన్ని ట్విట్టర్​లో పోస్టు చేశారు.

ఆ ఐడియా ఏంటంటే.. ‘‘రిషి సునక్​ను ఇండియాకు రప్పించాలి. ఆయన తన అత్తామామలను కలిసేందుకు వచ్చి బెంగళూర్ ట్రాఫిక్​లో చిక్కుకున్నప్పుడు కిడ్నాప్ చేయాలి. రిషి స్థానంలో ఆశిశ్ నెహ్రాను బ్రిటన్ ప్రధానిగా పంపించాలి. ఈ తేడాను ఎవరూ గుర్తించలేరు. కోహినూర్​ను వెనక్కి రప్పించే బిల్లును పాస్ చేయాలని నెహ్రాకు చెప్పాలి” అని పేర్కొన్నారు. గోయెంకా ట్వీట్​పై నెటిజన్లు స్పందిస్తూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ‘‘బెంగళూర్ ట్రాఫిక్​లో చిక్కుకున్నప్పుడు కిడ్నాప్ చేయడం ఎందుకు? రిషి అందులో నుంచి బయటపడే లోపు నెహ్రా బ్రిటన్ వెళ్లి బిల్లు పాస్ చేసి కోహినూర్ తీసుకొని వచ్చేస్తారు” అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు.