- లేబర్ మార్కెట్లో జెండర్ గ్యాప్పై స్టడీ చేసిన క్లాడియా గోల్డిన్
- 200 ఏండ్లలో పని ప్రదేశంలో మహిళల భాగస్వామ్యంపై విశ్లేషణ
- లేబర్ మార్కెట్లో మహిళల పాత్రపై సరికొత్త వివరాలను అందించారన్న నోబెల్ కమిటీ
స్టాక్హోం: లేబర్ మార్కెట్లో జెండర్ గ్యాప్పై స్టడీ చేసిన అమెరికా శాస్త్రవేత్త, హార్వర్డ్ వర్సిటీ ప్రొఫెసర్ క్లాడియా గోల్డిన్కు ఎకనమిక్స్లో నోబెల్ బహుమతి లభించింది. పని ప్రదేశంలో మహిళల భాగస్వామ్యంపై అధ్యయనం చేసి, మరింత అవగాహన కల్పించినందుకు ఈ అవార్డును గెలుచుకున్నారని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సోమవారం ప్రకటించింది.
క్లాడియా గోల్డిన్ పరిశోధనలు.. లేబర్ మార్కెట్లో మహిళల చారిత్రక, సమకాలీన పాత్రలపై ఆశ్చర్యకరమైన వివరాలను అందించాయని నోబెల్ కమిటీ తెలిపింది. గత 200 ఏండ్లలో పని ప్రదేశంలో మహిళల భాగస్వామ్యాన్ని ఆమె అధ్యయనం చేశారు. ఎకనమిక్ గ్రోత్ ఉన్నప్పటికీ.. పురుషులతో సమానంగా మహిళలకు వేతనం అందడం లేదని గుర్తించారు.
పురుషులతో పోలిస్తే ఎక్కువగా చదువుకున్నప్పటికీ ఈ విభజన ఇప్పటికీ తొలగిపోలేదని పేర్కొన్నారు. ‘‘జాబ్ మార్కెట్లో స్త్రీ పాత్ర, ఆమె పొందే వేతనం.. కేవలం సామాజిక, ఆర్థిక మార్పుల ద్వారా ప్రభావితం కావు. ఆమె వ్యక్తిగత నిర్ణయాలు కూడా ప్రభావం చూపుతాయి.
ఉదాహరణకు.. ఎంత విద్యను పొందాలి? తమ తల్లిని చూసి యువతులు తమ భవిష్యత్తుపై నిర్ణయాలు తీసుకుంటారు. తమ ముందు తరం విజయాలు, వైఫల్యాల నుంచి ప్రతి జనరేషన్ పాఠాలను నేర్చుకుంటుంది” అని విశ్లేషించారు. ‘‘గోల్డిన్ రీసెర్చ్.. పరిష్కారాలను మాత్రమే చూపలేదు. పాతుకుపోయిన సమస్యను పరిష్కరించడానికి పాలసీ మేకర్లకు దారిచూపింది.
పురుషులు, మహిళల మధ్య అంతరం మూలాన్ని, కాలక్రమేణా అది మారడాన్ని ఆమె వివరించారు” అని ఎకనమిస్ట్, నోబెల్ కమిటీ మెంబర్ రాండీ జాల్ మార్సన్ చెప్పారు.
అర్థశాస్త్రంలో మూడో మహిళ
అర్థశాస్త్రంలో నోబెల్ పురస్కారం అందుకున్న మూడో మహిళ క్లాడియా గోల్డిన్. 1946లో న్యూయార్క్లో జన్మించారు. షికాగో వర్సిటీలో పీహెచ్డీ చేశారు. హార్వర్డ్ వర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్గా పని చేస్తున్నారు. ‘‘నేను ఎల్లప్పుడూ ఆశావాదినే.. కానీ ఆ సంఖ్యలను చూసినప్పుడు.. అమెరికాలో ఏదో జరిగిందని అనుకున్నా. 1990లలో మహిళల విషయంలో మన లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు ప్రపంచంలోనే అత్యధికంగా ఉండేది. ఇప్పుడలా లేదు” అని క్లాడియా చెప్పారు.