
కాకినాడ: హాకీ ఇండియా జూనియర్ విమెన్స్ నేషనల్ చాంపియన్షిప్ డివిజన్–ఎలో హర్యానా, చత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తర్ప్రదేశ్ సెమీస్కు అర్హత సాధించాయి. శనివారం జరిగిన తొలి క్వార్టర్స్లో హర్యానా 4–1తో ఒడిశాపై గెలిచింది. కాజల్ (2వ నిమిషం), సుప్రియా (27వ ని), శశి ఖాసా (36వ ని), సాది (60వ ని) హర్యానాకు గోల్స్ అందించగా, ఒడిశా తరఫున అమీషా ఎక్కా (47వ ని) ఏకైక గోల్ చేసింది. మరో మ్యాచ్లో చత్తీస్గఢ్ 2–1తో మధ్యప్రదేశ్ను ఓడించింది.
రెగ్యులర్ టైమ్లో ఇరుజట్ల స్కోరు 1–1తో సమం కావడంతో పెనాల్టీ షుటౌట్ను నిర్వహించారు. చత్తీస్గఢ్ ప్లేయర్ యశోద (2వ ని) గోల్ చేయగా, హుడా ఖాన్ (15వ ని) ఎంపీకి గోల్ అందించడంతో స్కోరు సమమైంది. షూటౌట్లో చత్తీస్గఢ్ కెప్టెన్ రుక్మిణి రెండు గోల్స్ చేసి గెలిపించింది. మూడో క్వార్టర్స్లో జార్ఖండ్ 3–1తో పంజాబ్పై నెగ్గింది. 6వ నిమిషంలోనే పవన్ప్రీత్ కౌర్ గోల్ చేసి పంజాబ్ను ఆధిక్యంలో నిలబెట్టింది.
వెంటనే తేరుకున్న జార్ఖండ్ ప్లేయర్లు స్వీటీ డుంగ్డుంగ్ (7వ ని), శాంతి కుమారి (22వ ని), రోషిణి ఐండ్ (46వ ని) గోల్స్ సాధించారు. నాలుగో క్వార్టర్స్ మ్యాచ్లో యూపీ 2–1తో మహారాష్ట్రపై గెలిచింది. తొలి హాఫ్లో ఇరుజట్లు గోల్స్ చేయలేకపోయాయి. కానీ రెండో హాఫ్లో యూపీ ప్లేయర్లు సల్లు పుకరంబం (36వ ని), రష్మి పటేల్ (55వ ని) గోల్స్ కొట్టగా, మహారాష్ట్ర ప్లేయర్ దీక్షా నితిన్ షిండే (45వ ని) ఏకైక గోల్కే పరిమితమైంది.