ఎల్బీనగర్, వెలుగు: సిటీ శివార్లలోని ఓ రిసార్టులో జరిగిన బర్త్ డే పార్టీలో గంజాయిని గుర్తించిన హయత్నగర్ పోలీసులు 29 మంది యువకులు, నలుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. 50 గ్రాముల గంజాయి, 10 కార్లు, ఒక బైక్, డీజే సౌండ్ సిస్టం స్వాధీనం చేసుకున్నారు. నిందితులంతా సీబీఐటీ, ఎంజీఐటీ కాలేజీ స్టూడెంట్లని సమాచారం. హయత్నగర్ పరిధి పసుమాముల గ్రామ శివారులోని ఓ రిసార్టులో కొంతమంది రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న హయత్ నగర్ పోలీసులు శనివారం తెల్లవారుజామున 3 గంటలకు సోదాలు చేశారు. రిసార్టులోని కాటేజీల్లో తనిఖీలు చేయగా గంజాయి దొరికింది. జితిన్ సుభాష్ అనే యువకుడు తన బర్త్ డే సందర్భంగా ఫ్రెండ్స్కు పార్టీ ఇస్తున్నాడు. రోహిత్ అనే యువకుడు గంజాయి సప్లయ్ చేసినట్లు సమాచారం. జితిన్ సుభాష్ను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. రోహిత్ పరారీలో ఉన్నాడు. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన బయటకు రాకుండా పోలీసులు దాచేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. గతంలోనూ పసుమాముల సమీపంలోని ఓ రిసార్టులో జరిగిన రేవ్ పార్టీలో వివిధ రాష్ట్రాలకు చెందిన యువతులు పట్టుబడ్డ విషయం తెలిసిందే.
హయత్ నగర్ పీఎస్లో యువకుడి హల్ చల్
రేవ్ పార్టీ కేసులో పోలీసుల అదుపులో ఉన్న స్టూడెంట్ల తరఫున వచ్చిన కుంట్లూరుకు చెందిన మణికంఠ అనే యువకుడు హయత్నగర్ పీఎస్లో హల్చల్ చేశాడు. డీఐ నిరంజన్పై దురుసుగా ప్రవర్తించాడు. మణికంఠను పీఎస్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. డీఐ ఇచ్చిన కంప్లయింట్ మేరకు మణికంఠపై కేసు నమోదైంది.