హైదరాబాద్ ఉప్పల్ వేదికగా కొన్ని గంటల్లో క్రికెట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టీ20 జరగబోతుంది. సిరీస్ డిసైడర్ మ్యాచ్ కావడంతో..మ్యాచ్పై ఆసక్తి నెలకొంది. మ్యాచ్కు భారీగా ప్రేక్షకులు వచ్చే ఆవకాశం ఉంది. స్డేడియం కెపాసిటీ 39వేలు కాగా...స్టేడియం ఫుల్ అయ్యే ఛాన్సుంది. మ్యాచ్ను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పలు రకాల వస్తువులను నిషేధించింది. ఎట్టి పరిస్థితుల్లో నిషేధిత వస్తువులను స్టేడియంలోకి తీసుకురావద్దని సూచించింది. నిషేధిత వస్తువులతో మ్యాచ్ చూసేందుకు వస్తే అనుమతించే లేదని స్పష్టం చేసింది.
ఏ ఏ వస్తువులకు అనుమతి లేదు..?
ఇండియా, ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ నేపథ్యంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మొత్తం 18 రకాల వస్తువులపై నిషేధం విధించింది. పెంపుడు జంతువులు, తినుబండారాలు, సిగరెట్లు, కెమెరాలు, ఇతర రికార్డింగ్ పరికరాలు, ల్యాప్టాప్లు, లైటర్లు, అగ్గిపెట్టెలు, బాణసంచా, సెల్ఫీ స్టిక్స్, పదునైన వస్తువులు, హెల్మెట్లు, బ్యాక్ప్యాక్లు, మద్యం, డ్రగ్స్ ను తీసుకురావద్దని సూచించింది. వీటిల్లో ఏ ఒక్కదాన్ని ఫ్యాన్స్ తీసుకొచ్చినా అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేసింది.
భారీ భద్రత..
మ్యాచ్ కోసం పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. దాదాపు 2,500 మందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా 300 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే బాంబ్ డాగ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించారు.