
న్యూఢిల్లీ, వెలుగు: రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించేందుకు ఈ నెల 12 న రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోడీ పర్యటనకు సంబంధించి సీఎం కేసీఆర్కు ఆహ్వానం అందలేదని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. ముఖ్యమంత్రులకు కూడా ప్రోటోకాల్ పాటించని దుస్థితికి మోడీ సర్కారు దిగజారిందని విమర్శించారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏడాదిగా నడుస్తున్న ఎరువుల కర్మాగారాన్ని మళ్లీ ప్రారంభించడం విచిత్రంగా ఉందన్నారు. రాష్ట్ర పర్యటనకు వస్తున్న మోడీ.. తెలంగాణకు ఏమిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. రూ.3 లక్షల కోట్లపైగా కేంద్రానికి పన్నులు పంపితే.. తెలంగాణకు తిరిగి రూ. 1.60 లక్షల కోట్లు కూడా ఇవ్వలేదని అన్నారు. నెల రోజుల్లో గుజరాత్కు మాత్రం రూ.లక్ష కోట్లు ఇచ్చారన్నారు. మోడీ దేశానికి ప్రధానా? లేక గుజరాత్ కా? అని ప్రశ్నించారు.