
సోషల్ మీడియాలో రోజురోజుకు మోసాలు పెరిగిపోతున్నాయి. తక్కువ సమయంలో డబ్బులు సంపాదించాలనే ఆశతో రకరకాల పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. ముఖ్యంగా నిరుద్యోగులను ఉద్యోగాల పేరుతో ఆశ చూపి నిండా ముంచుతున్నారు. సోషల్ మీడియాలో అందమైన అమ్మాయిల ఫొటో ప్రొఫైల్ డీపీగా పెట్టుకుని ఫ్రెండ్ రిక్వెస్ట్లకు స్పందించిన వారిని ట్రాప్ చేస్తున్నారు. ఫోన్ కాల్స్ కాకుండా కేవలం చాటింగ్స్తోనే అట్రాక్ట్ చేసి డబ్బులు పంపమని చెప్పి అందినకాడికి దోచుకుంటున్నారు.
ఈ మధ్య కొందరు ( అమ్మాయిలా సోషల్ మీడియాలో పరిచయం చేసుకుని) దోచుకుంటున్నారు. లేటెస్ట్ ఇలాంటి ఘటనే నిర్మల్ జిల్లాలో ముథోల్ మండలం విఠోలితండాలో జరిగింది. ఓ యువకుడు ఇన్ స్టాగ్రామ్ లో అమ్మాయిలా పరిచయం చేసుకొని ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురి నుంచి ఒక్కొక్కరి దగ్గర రూ. 20 వేల చొప్పున డబ్బులు వసూలు చేశాడు.
బాధిత యువకుల వివరాల ప్రకారం. . సూర్యపేట జిల్లా జాన్ పహాడ్ పరిధిలోని చెర్వుతండాకు చెందిన బనావత్ గణేశ్ కొన్నిరోజుల క్రితం ఇన్ స్టాగ్రామ్ లో అమ్మాయిలా పరిచయం అయ్యాడు. ఉద్యోగం ఉంటే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. మా సోదరుడు నిజామాబాద్ కు వస్తున్నాడు అతడిని ఒకసారి కలవాలని చెప్పాడు.
కట్ చేస్తే గణేష్.. నిజామాబాద్ లో ఇన్ స్టాగ్రమ్ లో పరిచయం అయిన అమ్మాయి సోదరుడిలా మమ్మల్ని కలిశాడు. ఇక్కడే కొన్ని రోజులు మాతో పాటే ఉన్నాడు. మాతో ఉంటూనే అమ్మాయిలా చాటింగ్ చేశాడు. రూ. 20 వేలు ఇస్తే మా తమ్ముడు ఉద్యోగం ఇప్పిస్తాడని అమ్మాయిలా చాటింగ్ చేశాడు. దీంతో రూ. 20 వేలు ఇచ్చా.. అలా నాతో పాటు చాలా మంది యువకులను నమ్మించి 20వేల చొప్పున వసూలు చేసి హైదరాబాద్ తీసుకువెళ్లాడు. అక్కడ ఒక హాస్టల్ ఉంచి రోజులు పెట్టాడు. ఇలా కొన్ని రోజుల తర్వాత తాము మోసం పోయినట్టు గ్రహించి ముధోల్ పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేశాం అని బాధిత యువకులు చెప్పారు.