పెషావర్: కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్ (సీటీడీ) స్టేషన్.. పైగా మిలటరీ అధీనంలో ఉండే కంటోన్మెంట్ ఏరియాలో ఉంటుంది.. అక్కడ సెక్యూరిటీ ఓ రేంజ్లో ఉంటుంది. కానీ ఓ మిలిటెంట్.. సీటీడీ స్టేషన్ బిల్డింగ్నే తన ఆధీనంలోకి తీసుకున్నాడు. తనను అరెస్టు చేసి, ఇంటరాగేట్ చేసేందుకు తీసుకొచ్చిన పోలీసులను తన బందీలుగా చేసుకున్నాడు. ఆదివారం పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తున్వా ప్రావిన్స్లో జరిగిందీ ఘటన. మిగతా మిలిటెంట్లను విడిపించి.. ప్రభుత్వంతో బేరానికి దిగాడు. ఆర్మీ వచ్చింది.. 40 గంటలకు పైగా సాగిన ఉత్కంఠకు తెరదించింది. టెర్రరిస్టులను మట్టుబెట్టి.. బందీలను విడిపించింది.
అసలేం జరిగింది..?
తెహ్రీక్ ఈ తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ) మిలిటెంట్ను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. బన్ను కంటోన్మెంట్లోని కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్ పోలీస్ స్టేషన్లో ఉంచి విచారణ జరిపారు. ఏం జరిగిందో ఏమో.. పోలీసుల నుంచి ఏకే 47 గన్ను ఆ మిలిటెంట్ లాక్కున్నాడు. కాల్పులకు దిగాడు. తర్వాత ఆ బిల్డింగ్లోనే ఉన్న మిగతా మిలిటెంట్లను విడుదల చేశాడు. అందరూ కలిసి మొత్తం కాంపౌండ్ను తమ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. పోలీసులను బందీలుగా చేసుకున్నారు. తాము సేఫ్గా వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. కాగా, పాక్ ఎస్ఎస్జీ కమాండోలు రంగంలోకి దిగి కేవలం 15 నిమిషాల్లోనే టెర్రరిస్టులను మట్టుబెట్టారు..
పాక్లో సిలిండర్ పేలి 12 మంది మృతి
కరాచీ: పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ లో గ్యాస్ సిలిండర్ పేలి భారీ అగ్ని ప్రమాదంజరిగింది. ఈ యాక్సిడెంట్లో 12 మంది చనిపోయారు. 25 మంది గాయపడ్డారు. సోమవారం లాస్బెలా జిల్లాలోని గ్యాస్ ఫిల్లింగ్ షాపులో రీఫిల్ చేస్తుండగా సిలిండర్ పేలి ఈ ప్రమాదం జరిగింది. మంటలు పక్కనున్న షాపులకూ వ్యాపించాయి. దీంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోగా, మరో 10 మంది హాస్పిటల్లో మరణించారని పోలీసులు తెలిపారు. అలాగే, మంటల్లో 25 మంది గాయపడ్డారు. వీరిని కరాచీలోని డాక్టర్ రూత్ ఫావ్ సివిల్ హాస్పిటల్కు తరలించారు. కొందరు 70 నుంచి 90 శాతం కాలిపోయారని, వారి పరిస్థితి క్రిటికల్గా ఉందని డాక్టర్లు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు వెల్లడించారు. అదే విధంగా ఆ షాపులోని నాలుగు బైక్లతో పాటు పక్కనే ఉన్న 24కు పైగా బైక్లు కాలిపోయాయి. ఫైర్ స్టాఫ్సహకారంతో మంటలను అదుపు చేశామని, ఘటనకు బాధ్యులపై ఎంక్వైరీ స్టార్ట్ చేశామని లాస్బెలా డిప్యూటీ కమిషనర్ మురాద్ కాసి తెలిపారు.
