మియాపూర్, వెలుగు: రోడ్డు మధ్యలో డివైడర్ను ఢీకొట్టి నిలిచిపోయిన కారును హెడ్ కానిస్టేబుల్ తొలగిస్తుండగా పాలవ్యాన్ ఢీకొట్టింది. ఈ సంఘటన మియాపూర్ మదీనాగూడ హైవేపై జీఎస్ఎం మాల్ ఎదురుగా బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగింది. అక్కడ ఓ కారు డివైడర్ ను ఢీకొట్టింది.
ట్రాఫిక్ జామ్ కావడంతో మియాపూర్ పోలీస్స్టేషన్ నుంచి హెడ్ కానిస్టేబుల్ ఖలీముద్దీన్ తో పాటు మరో కానిస్టేబుల్ అక్కడికి వచ్చారు. ప్రమాదానికి గురైన కారును తొలగిస్తుండగా వికారాబాద్ నుంచి ముసాపేట్ కు వెళ్తున్న పాల వ్యాన్ వేగంగా దూసుకువచ్చి హెడ్ కానిస్టేబుల్ ఖలీముద్దీన్ ను ఢీకొట్టింది. తీవ్ర గాయాలు కాగా దవాఖానకు తరలించారు. పాలవ్యాన్ డ్రైవర్ దేవిరెడ్డిని అదుపులోకి తీసుకొని బ్రీత్ ఎనలైజర్ పరీక్ష నిర్వహించగా 246 పాయింట్లు వచ్చింది.
