- వాటిని సద్వినియోగం చేసుకోవాలి
- మంత్రి వివేక్ వెంకటస్వామి
ముషీరాబాద్/బషీర్బాగ్, వెలుగు: ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయొద్దని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్, శ్రీరోషన్ లాల్ అగర్వాల్ ఫౌండేషన్ ట్రస్ట్ సంయుక్తంగా ఆదివారం బాగ్ లింగంపల్లిలోని అంబేద్కర్ కాలేజీ ఆవరణలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. క్యాంపులో ఏర్పాటు చేసిన కంటి పరీక్షలు, ఫిజియోథెరపీ, డెంటల్, ఆర్థోపెడిక్, కార్డియాలజీ, ఈసీజీ, 2డి ఎకో, బీపీ పరీక్షలు వంటి వైద్య సేవలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఉచిత హెల్త్ క్యాంపులు పేదవారికి ఎంతో దోహదపడతాయన్నారు.
అలాంటి క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రోగులకు ఉచితంగా కృత్రిమ అవయవాలు, హ్యాండ్ కిట్లు, కాలిపర్స్ వంటి పరికరాలు అందించడం సంతోషంగా ఉందన్నారు. పేద రోగులకు ఉచితంగా డయాలసిస్ సేవలు అందించడం గొప్ప విషయమని కొనియాడారు.
హైదరాబాద్ బర్కత్ పురలోని టీపీసీసీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ముజాయిద్ ఆలం ఖాన్ నివాసంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మంత్రి వివేక్ వెంకటస్వామి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ , ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోతె రోహిత్ పాల్గొన్నారు. ముస్లిం మతపెద్దలతో కలిసి ప్రార్థనలు చేసి ఇఫ్తార్ విందును స్వీకరించారు.
