మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ కింగ్ డిసౌజా అలియాస్ స్టీవ్ కస్టడి కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది. ఐదు రోజుల కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో ఇటీవల పోలీసులు పిటిషన్ వేశారు. గత మూడ్రోజుల క్రితం గోవాలో స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి గోవా టాప్ హిల్స్ రెస్టారెంట్ యజమాని డిసౌజాను అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా స్టీవ్ కు600 కస్టమర్స్ కలిగి ఉండగా.. హైదరాబాద్ లో 168మంది కస్టమర్స్ ఉన్నట్టు ఇప్పటికే అధికారులు గుర్తించారు. అనంతరం స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి ట్రాన్సిట్ వారెంట్పై డిసౌజాను హైదరాబాద్కు తరలించారు. నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసి, ఆ తర్వాత చంచల్గూడ జైలులో రిమాండ్కు తరలించారు. గత నెల 16న ప్రీతీష్ నారాయణ అనే డ్రగ్ సప్లయర్ను హబ్సిగూడలో హెచ్న్యూ పోలీసులు అరెస్ట్ చేశారు. 20 ఎక్స్టసీ పిల్స్, 5 ఎల్ఎస్డీ బ్లాట్స్, 4 గ్రాముల ఎండీ ఎమ్ఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కస్టడీకి తీసుకుని విచారించారు.
నారాయణ ఇచ్చిన సమాచారంతో గోవా వెళ్లిన పోలీసులు .. డిసౌజా నుంచి అతడు డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు ఆధారాలు సేకరించారు. హిల్ టాప్ సిన్స్1983 పేరుతో డీజే ప్లేయర్గా డిసౌజా పనిచేస్తున్నాడు. గోవా బజార్ పేరుతో టూరిస్టులకు పార్టీలు కూడా ఏర్పాటు చేయడంతో పాటు, వారికి డ్రగ్స్ సైతం సప్లయ్ చేసేవాడు. ఈ క్రమంలోనే అదే ప్రాంతానికి చెందిన మరో ఆరుగురిని ఏజెంట్స్గా నియమించుకుని గ్యాంగ్ ఏర్పాటు చేశాడు. హైదరాబాద్తో పాటు దేశవ్యాప్తంగా డ్రగ్స్ సప్లయ్ చేసేవాడు. డిసౌజా నెట్వర్క్లో హైదరాబాద్కు చెందిన ప్రీతీష్ నారాయణ ఏజెంట్గా ఉన్నాడు.