భద్రాచలానికి పోటెత్తిన భక్తులు

భద్రాచలానికి పోటెత్తిన భక్తులు

భద్రాచలం, వెలుగు:  శ్రీసీతారామచంద్రస్వామికి శనివారం గర్భగుడిలో సువర్ణ తులసీ దళాలతో అర్చన జరిగింది. ఉదయం గోదావరి నుంచి తీర్థబిందెను తెచ్చి గర్భాలయంలో మూలవరులకు సుప్రభాత సేవ చేశారు. బాలబోగం నివేదించారు. తర్వాత భద్రుని మండపంలో శ్రీరామపాదుకలకు పంచామృతాలతో అభిషేకం చేశారు. శ్రీసీతారామచంద్రస్వామికి బంగారు తులసీ దళాలతో అర్చన చేయగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. సెలవులు కావడంతో భక్తులు పోటెత్తారు. భక్తుల జయజయధ్వానాల మధ్య కల్యాణమూర్తులను ఊరేగింపుగా చిత్రకూట మండపానికి తీసుకొచ్చారు. 100 జంటలు స్వామికి నిత్య కల్యాణం నిర్వహించడానికి ముందుకు వచ్చాయి. 

కల్యాణాన్ని చిత్రకూట మండపంలో నిర్వహించారు. ముందుగా స్వామికి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం ఆరాధన చేసి కల్యాణం నిర్వహించే 100 మంది దంపతులకు కంకణధారణ చేశారు. స్వామికి యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగల్యధారణ, తలంబ్రాల వేడుక జరిగాయి. మంత్రపుష్పంతో క్రతువు ముగిసింది. కల్యాణ సీతారాములను గర్భగుడిలోకి తీసుకెళ్లి రాజబోగం నివేదించారు. సాయంత్రం దర్బారు సేవ జరిగింది. నాగర్​కర్నూల్​ అడిషనల్​ కలెక్టర్​ మనుచౌదరి కుటుంబసభ్యులతో కలిసి రామయ్యను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. 

రూ.5 లక్షల విరాళం

శ్రీసీతారామచంద్రస్వామి నిత్యాన్నదాన పథకానికి ఏపీలోని కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన బోయపాటి వెంకటసుబ్బయ్య, సుబ్బమ్మల జ్ఞాపకార్ధం వారి కుమారులు బోయపాటి సీతారామాంజనేయులు, శ్రీమన్నారాయణ రూ.5లక్షల విరాళం ఈవో శివాజీకి అందజేశారు. వారికి ఆలయంలో ప్రత్యేక​ దర్శనం కల్పించి స్వామి వారి తీర్థప్రసాదాలు అందించారు.