తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. గురువారం (మే28) నల్లగొండ, భద్రాద్రి కొత్తగూడెం, కొమురం భీం అసిఫిబాద్, నిర్మల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కూడిన వాన పడింది. అకాలవర్షంతో కల్లాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వడ్లు, మక్కలు తడిసిముద్దయ్యాయి. కొన్ని చోట్ల ధాన్యం నీటిలో కొట్టుకుపోయింది. రైతులకు తీరనినష్టం వాటిల్లింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీటిపాలు కావడంతో రైతులు ఆందోళన చెందారు.
నిర్మల్ జిల్లాలో ఖానాపూర్, పెంబి మండలాల్లో గురువారం సాయంత్రం కురిసిన వర్షాలకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో ఉన్న వడ్లు, మక్కలు తడిసి ముద్దయ్యాయి. వర్షపునీటిలో కొనుగోలు కేంద్రాల్లోని వడ్లు కొట్టుకుపోయాయి. చేతికొచ్చిన పంట నీటి పాలవుతుంటే రైతుకు కన్నీరే మిగిలింది. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
మరోవైపు కొమురం భీం జిల్లా కాగజ్ నగర్, కౌటాల మండలాల్లో అకాల వర్షం భీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షం కురిసింది. దీంతో ఆయా మండలాల్లోని పలుచోట ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడిసిపోయాయి.
అయితే ఓ వైపు వర్షాలు కురుస్తున్నప్పటికీ, వాతావరణ శాఖ ఉత్తర ,తూర్పు తెలంగాణ జిల్లాల్లో గురువారం వడగాలుల వీచాయి. కొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల నుంచి 44 డిగ్రీల వరకు నమోదయ్యాయి.
