వేల ఎకరాల్లో దెబ్బతిన్న పంట
మురిగిపోతున్న పత్తి కాయలు… భారీగా లాస్ అయిన రైతులు
ఆదుకోవాలని కంపెనీలు, సర్కారుకు విన్నపం
గద్వాల, వెలుగు : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు సీడ్ పత్తి రైతులు ఆగం అవుతున్నారు. వాగులు, వంకలు ఉప్పొంగి పొలాలను ముంచెత్తడంతో వేల ఎకరాల్లో పంట నష్టపోయారు. పొలాల్లో నీళ్లు నిలవడంతో పంట చాలా వరకు దెబ్బతిన్నది. ఆకులు రంగు మారడం, కాయలు రాలిపోవడం, ఉన్నా మురిగిపోవడం లాంటి సమస్యలు తలెత్తాయి. ఇప్పుడు మందులు కొట్టినా ఫలితం ఉండదని, ఒక్కో ఎకరాకు లక్షల్లో లాస్ అవుతున్నామని రైతులు వాపోతున్నారు. కంపెనీలు, సర్కారే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
కాటన్ సీడ్ కు పెట్టింది పేరు
నడిగడ్డ కాటన్ సీడ్కు పెట్టింది పేరు. జిల్లాలో40 వేల ఎకరాలకుపైగా సీడ్ పత్తి సాగవుతుండడంతో చాలా కంపెనీలు ఇక్కడే తిష్ట వేశాయి. రైతులతో అగ్రిమెంట్ చేసుకొని బిజినెస్ చేస్తున్నాయి. ఈ యేడు ఇప్పటికే కురిసిన వర్షాలకు దాదాపు 30 శాతం పంట దెబ్బతిన్నది. ఎర్ర తెగులు సోకడంతో రైతులు ఇప్పటికే ఈ మొక్కలను తొలగించారు. వారం రోజులుగా మళ్లీ వానలు పడుతుండడంతో మరో 15 శాతం పంట నష్టపోయారు. అంటే జిల్లాలో సాగైన పంటలో సగం దెబ్బతిన్నది. ఉన్న పంట కూడా దిగుబడి వచ్చేలా లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భారీగా లాస్
పంటకు ఎర్ర తెగులు సోకడం, కాయలు మురిగిపోవడంతో రైతులు భారీగా లాస్ అవుతున్నారు. ఒక ఎకరా సీడ్ పత్తి పంట సాగు చేయాలంటే రూ. లక్ష వరకు పెట్టుబడి అవుతుంది. సరాసరి ఎకరాకు 400 నుంచి 800 ప్యాకెట్లు పండిస్తారు. ఒక్కో ప్యాకెట్ ధర 400 రూపాయల వరకు ఉంటుంది. యావరేజీగా ఎకరాకు 600 ప్యాకెట్లు అనుకున్నా.. 2.5 లక్షల వరకు వస్తాయి. అంటే పెట్టుబడి పోనూ ఎకరాకు లక్ష నుంచి లక్షన్నర వరకు లాస్ అయ్యే పరిస్థితి నెలకొన్నది.
నష్టంపై అంచనా వేస్తాం
వానలతో సీడ్ పత్తి రైతులు నష్టపోయిన మాట వాస్తవమే. పంట నష్టాన్ని అంచనా వేస్తాం. సీడ్ పత్తి కంపెనీలు ప్రొడక్షన్ ప్లానింగ్ ఇస్తే ఎంత నష్టం జరిగిందనే దానిపై క్లారిటీ వస్తుంది. త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక పంపిస్తాం.– గోవింద నాయక్, జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్