హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు శుక్ర, శనివారాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. శుక్రవారం ఆదిలాబాద్, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షం పడుతుందని తెలిపింది.
శనివారం మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, సిద్దిపేట, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లోని కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయని వివరించింది. హైదరాబాద్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం పడే చాన్స్ ఉందని చెప్పింది. కాగా, ప్రస్తుతం బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం ఉందని, దాని ప్రభావంతో శుక్రవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.