
- డమ్మీ అని తేలడంతో ఊపిరి పీల్చుకున్న జనం
- ఆకతాయిలు నిప్పు పెట్టడంతోనే ప్రమాదం
ఎల్బీనగర్, వెలుగు: సినిమా షూటింగ్ కోసం తీసుకువచ్చిన డమ్మీ హెలికాప్టర్లో అగ్నిప్రమాదంలో జరిగింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడ చెందిన ఓ వ్యక్తి సినిమా షూటింగ్ కోసం డమ్మీ హెలికాప్టర్ ను తీసుకొచ్చి ఆరేండ్ల కింద స్థానికంగా ఉన్న ప్లై టెక్ ఏవియేషన్ ఓపెన్ ప్లేస్ లో ఉంచాడు.
షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఆ డమ్మీ హెలికాప్టర్ నిరుపయోగంగా అక్కడే ఉండిపోయింది. శుక్రవారం గుర్తు తెలియని ఆకతాయిలు ఆ హెలికాప్టర్ కు నిప్పు పెట్టారు. దీంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి కాలి బూడిదైంది. అయితే, తొలుత అటుగా వెళ్తున్న వాహనదారులు నిజమైన హెలికాప్టరే దగ్ధమైందనుకొని భయాందోళనకు గురయ్యారు.
తీరా అసలు విషయం తెలుసకొని ఊపిరి పీల్చుకున్నారు. స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.