
కరోనా మహమ్మారి కారణంగా హెమోఫిలియా రోగులు పూర్తి భయాందోళనల్లో కూరుకుపోయారని అన్నారు నిమ్స్ హాస్పిటల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ –పాథాలజిస్ట్ డాక్టర్ రాధిక కనకరత్న. వంశపారంపర్య జన్యు లోపం కారణంగా వచ్చే ఈ వ్యాధి రోగులు.. ఆస్పత్రికి వెళ్తే కరోనా వ్యాధి తమకు ఎక్కడ సోకుతుందోననే భయ పడుతున్నారని ఆమె అన్నారు. ఆ రోగులకు రక్తాన్ని గడ్డకట్టించే లక్షణంపై శరీరం నియంత్రణను కోల్పోతుందని, అధికంగా రక్త స్రావం కావడం వల్ల కరోనా సోకి మరణించేందుకు అవకాశాలు అధికంగా ఈ వ్యాధిలో ఉంటాయని అన్నారు.
ఆస్పత్రిలో అవసరమైన చికిత్స సదుపాయాలు ఉన్నప్పటికీ, కరోనా వైరస్ పరిస్థితుల కారణంగా ఆస్పత్రులకు వెళ్లడానికి రోగులు భయపడుతున్నారు. హెమోఫిలియా రోగులు సాధారణ జీవితం గడపాలంటే ముందుగా రోగ నిర్థారణ జరగడం, చికిత్స నందించడం, ఫిజియోథెరఫీ అనేవి అత్యంత కీలకమని చెప్పారు.హెమోఫిలియా సాధారణంగా హెమోఫిలియా ఏ మరియు హెమోఫిలియా బీ అని రెండు రకాలుగా ఉంటుందన్నారు. సాధారణ ప్రజల్లాగానే హెమోఫిలిక్స్ కూడా కోవిడ్–19 ప్రమాద బారిన పడేందుకు అవకాశాలున్నాయని, అందువల్ల రోగులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.