షాక్ : లక్షా 40 వేల ఫోన్ నెంబర్లు బ్లాక్ చేసిన కేంద్రం

షాక్ : లక్షా 40 వేల ఫోన్ నెంబర్లు బ్లాక్ చేసిన కేంద్రం

డిజిటల్ మోసాలను ఎదుర్కోవడంలో భారత ప్రభుత్వం నిర్ణయాత్మక చర్య తీసుకుంది.  తాజాగా ఆన్‌లైన్‌లో ప్రజలను మోసం చేయడానికి ఉపయోగించిన 1.4 లక్షల మొబైల్ నంబర్లు, హ్యాండ్‌సెట్లను బ్లాక్ చేసింది. ఆర్థిక సేవల రంగంలో సైబర్ భద్రతపై చర్చించేందుకు ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి నేతృత్వంలో ప్రభుత్వ అధికారులు సమావేశమయ్యారు.  అక్రమాలకు ఉపయోగిస్తున్న ఫోన్ నంబర్లను బ్లాక్ చేయడంతో పాటు, ప్రతిష్టాత్మక సంస్థలకు చెందిన అధికారులు వివిధ అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. 

ఫేక్ లేదా నకిలీ పత్రాలపై తీసుకున్న మొబైల్ కనెక్షన్లను గుర్తించేందుకు AI-మెషిన్ లెర్నింగ్ ఆధారిత ఇంజన్ అయిన ASTRను టెలీ కమ్యూనికేషన్ విభాగం అభివృద్ధి చేసింది. బల్క్ SMSలు పంపుతున్న 35 లక్షల ప్రిన్సిపల్ ఎంటిటీలను దీని ద్వారా విశ్లేషించింది. ఇది హానికరమైన SMSలు పంపిన వారిని బ్లాక్ లిస్ట్ చేసింది లేదా డిస్‌కనెక్ట్ చేసింది. ఇప్పటి వరకు 500 కంటే ఎక్కువ అరెస్టులు జరిగాయి. ఏప్రిల్ 2023 నుంచి దాదాపు 3.08 లక్షల సిమ్‌లు, 50,000 IMEIలు, 592 ఫేక్ లింక్‌లు లేదా APKలు, 2,194 URLలను బ్లాక్ చేశారు.