ఇది మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ అంటూ ఇప్పటికే చాలామంది హీరోయిన్స్ సినీ పరిశ్రమ గురించి కామెంట్ చేశారు. ఇప్పుడు కృతీ సనన్ కూడా అదే అంటోంది. ఎంత సక్సెస్ అయినా హీరోకి ఉన్న ఇంపార్టెన్స్ హీరోయిన్కి ఉండదని తెగేసి చెబుతోంది. నేనొక్కడినే, దోచెయ్ లాంటి సినిమాలతో తెలుగువారికి దగ్గరైన కృతి.. ఆ తర్వాత బాలీవుడ్లో బిజీ అయిపోయింది. ప్రస్తుతం చాలా సినిమాలు చేస్తోంది. ప్రభాస్తో కలిసి ‘ఆదిపురుష్’లోనూ నటిస్తోంది. అయితే ఇన్ని సినిమాలు చేస్తున్నా కూడా ఇండస్ట్రీలో ఇంపార్టెన్స్ లేదంటోంది కృతి. ఆమె నటించిన ‘బచ్చన్పాండే’ ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పింది.
‘హీరోలతో సమానంగా స్క్రీన్ స్పేస్ సంపాదించే చాన్స్ హీరోయిన్లకు లేదు. హీరోకి ఎప్పుడూ అరవైశాతం ఉండాలి. హీరోయిన్కి నలభై శాతమే ఉండాలి. అలా లేకపోతే చాలామంది హీరోలు నటించరు కూడా. గతంలో కొన్ని సినిమాల విషయంలో నేనిది ఫేస్ చేశాను. హీరోలు తగ్గకూడదా? వాళ్లదే పైచేయి అయ్యుండాలా? ఈ పద్ధతి మారాలి’ అంది కృతి. ఇప్పుడిప్పుడే మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుకెళ్లడానికి ట్రై చేస్తున్నారని, వాళ్లని ఎంకరేజ్ చేయాలి తప్ప వెనక్కి లాగే ప్రయత్నం చేయకూడదని అంటోంది.