సుహాస్ హీరోగా గోపి అచ్చర దర్శకత్వంలో బి నరేంద్ర రెడ్డి నిర్మించిన చిత్రం ‘హే భగవాన్’. ఫిబ్రవరి 20న సినిమా విడుదల కానుంది. బన్నీ వాస్, వంశీ నందిపాటి థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత బి నరేంద్ర రెడ్డి మాట్లాడుతూ ‘కడప జిల్లాలోని ప్రొద్దుటూరు నా స్వస్థలం. ప్రస్తుతం బెంగళూరులో కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నా. చిన్నప్పట్నుంచీ సినిమాలంటే ఇష్టంతో కన్నడలో కొన్ని చిత్రాలు నిర్మించా. తెలుగులో నిర్మించిన నా తొలి చిత్రమిది.
కథ వినగానే ఎంటర్టైనింగ్గా ఆసక్తిగా అనిపించింది. కామెడీతోపాటు ఎమోషనల్గా ఉండే సినిమా ఇది. ముఖ్యంగా ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ అందరి హృదయాలను హత్తుకుంటుంది. సుహాస్, నరేష్, సుదర్శన్, వెన్నెల కిషోర్ ఇలా ప్రతి పాత్ర ఆడియెన్స్ను బాగా ఎంటర్టైన్ చేస్తుంది. అలాగే ఆడియెన్స్ ఊహకు అందనివిధంగా స్ర్కీన్ప్లే ఉంటుంది. ఇక అనుకున్న బడ్జెట్లోనే సినిమా పూర్తయింది. ప్రతిది ప్లానింగ్ ప్రకారమే వెళ్లాం. సినిమాకు పెట్టిన ప్రతి రూపాయి తెరపై కనిపిస్తుంది. బన్నీ వాస్, వంశీ నందిపాటి అసోసియేషన్తో ఈ సినిమా విజయంపై మరింత నమ్మకం పెరిగింది. నెక్స్ట్ సత్యదేవ్, ఫరియా అబ్దుల్లా జంటగా లక్ష్మీ నారాయణ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నా’ అని చెప్పారు.
