
న్యూఢిల్లీ/లండన్: లండన్లోని ఇండియన్ హై కమిషన్ ఆఫీస్పై ఎగురుతున్న జాతీయ జెండాను ఖలిస్థానీ వేర్పాటువాదులు కిందికి దించేసి అగౌరవపరిచారు. హైకమిషన్ సిబ్బంది జెండాను వారి చేతుల్లో నుంచి లాక్కుని భద్రపరిచారు. ఖలిస్థానీ వేర్పాటువాదులకు చెంపపెట్టులా అతి పెద్ద మూడు రంగుల జెండాను హైకమిషన్ ఆఫీస్పై అమర్చారు. లండన్లోని ఇండియా హౌస్పై ఉన్న ఈ భారీ జాతీయ జెండా ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్విట్టర్ లో ఈ ఫొటోను షేర్ చేసిన బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ ‘జెండా ఊంచా రహే హమారా’ అంటూ కామెంట్ పెట్టారు. జాతీయ జెండాను అగౌరవపరిచేందుకు ప్రయత్నించినవారిపై బ్రిటన్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, ఖలిస్తానీ మద్దతుదారుడు జాతీయ జెండాను కిందకు లాగుతున్న వీడియో వైరల్ కావడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మనదేశం.. ఢిల్లీలోని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ను వివరణ కోరింది. కాగా, ఈ ఘటనకు సంబంధించి ఒక వ్యక్తిని స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో ఇద్దరు సెక్యూరిటీ సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయని, దీనిపై ఇన్వెస్టిగేషన్ మొలైందని చెప్పారు. ఇండియన్ హైకమిషన్ దగ్గర సెక్యూరిటీని పెంచుతామని, ఇలాంటి ఘటనపై కఠినంగా వ్యవహరిస్తామని బ్రిటన్ అధికారులు తెలిపారు.
శాన్ఫ్రాన్సిస్కోలోనూ..
వాషింగ్టన్: అమెరికా శాన్ఫ్రాన్సిస్కోలోని ఇండియన్ కాన్సులేట్పై కూడా ఖలిస్థానీ మద్దతుదారులు ఆదివారం రాత్రి దాడికి పాల్పడ్డారు. సెక్యూరిటీ బారికేడ్లను దాటుకుంటూ.. ఖలిస్థాన్కు మద్దతుగా నినాదాలు చేస్తూ పలువురు ఇండియన్ కాన్సులేట్లోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. రాడ్లు, కర్రలతో బిల్డింగ్ తలుపులు, కిటికీలను బద్దలుకొట్టారు. కాన్సులేట్ ఆవరణలో రెండు ఖలిస్థానీ జెండాలను ఎగరేశారు. అయితే వీటిని అక్కడి సిబ్బంది వెంటనే తొలగించారు. ఈ దాడిని అమెరికాలోని ఇండియన్లు తీవ్రంగా ఖండించారు. కాన్సులేట్పై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.