హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలోని 84 ఎకరాల భూమి హక్కులు తమవేనని రాష్ట్ర సర్కార్ వేసిన రీకాల్ పిటిషన్పై హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. సర్వే నెం. 234 లోని 84 ఎకరాల భూమి తమదేనని ప్రైవేట్ వ్యక్తులు బూర్గుల రామకృష్ణ, లింగమయ్య వేసిన పిటిషన్కు విచారణ అర్హత ఉందో లేదో చెబుతామన్న హైకోర్టు.. ఏకంగా ఆ వ్యక్తులకు భూములపై హక్కులున్నాయని తీర్పు చెప్పడం చట్ట వ్యతిరేకమంటూ ప్రభుత్వం ఇటీవల రీకాల్ పిటిషన్ దాఖలు చేసింది.
దానిపై జస్టిస్ గండికోట శ్రీదేవి, జస్టిస్ ప్రియదర్శినిలతో కూడిన డివిజన్ బెంచ్ శనివారం విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ వాదనలు వినిపిస్తూ.. 84 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని చెప్పారు. హైకోర్టు తీర్పు చెప్పాక నోటీసులివ్వలేదనడం సరికాదని ప్రైవేట్ వ్యక్తుల తరఫు అడ్వొకేట్స్ ఆదినారాయణరావు, అశోక్ ఆనంద్ వాదించారు. వాదనలు విన్న హైకోర్టు తీర్పును వాయిదా వేసింది.