- తమకు నచ్చిన చోట టెస్ట్లు, ట్రీట్మెంట్ చేసుకునే హక్కు ప్రజలకుంది
- ప్రైవేటు మీద నమ్మకం లేకుంటే ఆరోగ్యశ్రీ ఎట్లా ఇస్తున్నరు
- ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారం వ్యవహరించాలన్న కోర్టు
హైదరాబాద్, వెలుగు: కేవలం గాంధీ, నిమ్స్ హాస్పిటళ్లలోనే కరోనా టెస్టులు చేయడం సరికాదని.. ప్రభుత్వం చెప్పినచోటే టెస్టులు, ట్రీట్మెంట్అంటే స్వేచ్ఛా హక్కును హరించడమేనని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రైవేటు హాస్పిటళ్ల మీద నమ్మకం లేకపోతే ఆరోగ్యశ్రీలో సేవలకు ఎలా అనుమతి ఇచ్చారని నిలదీసింది. ప్రైవేట్ హాస్పిటళ్లు, ల్యాబ్స్లో కరోనా టెస్టులు, ట్రీట్మెంట్కు పర్మిషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఐసీఎంఆర్ గైడ్లైన్స్కు అనుగుణంగా వాటిని ఎంపిక చేయాలని సూచించింది. ఈ మేరకు జస్టిస్ ఎమ్మెస్ రామచందర్రావు, జస్టిస్ కె.లక్ష్మణ్లతో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం 38 పేజీల తీర్పు వెలువరించింది.
నచ్చిన చోట ట్రీట్ మెంట్ చేయించుకోవచ్చు
రాష్ట్రంలోని ప్రైవేటు హాస్పిటళ్లలో కరోనా టెస్టులు, ట్రీట్మెంట్చేయరాదంటూ సర్కారు ఆదేశించడం సరికాదని.. ఐసీఎంఆర్ అనుమతులున్న హాస్పిటళ్లకు పర్మిషన్ ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైదరాబాద్కు చెందిన గంటా జయకుమార్ హైకోర్టులో పిల్ వేశారు. ప్రైవేట్ హాస్పిటళ్లలో కరోనా ట్రీట్మెంట్ కూడా ఇవ్వొచ్చని మార్చి 21న హైదరాబాద్ డీఎంహెచ్ వో అనుమతి ఇచ్చారని.. కానీ ఈ నెల 11న అన్ని ట్రీట్మెంట్లను ఆపేసి, కరోనా ట్రీట్మెంట్ మాత్రమే చేయాలని ఆదేశించారని కోర్టుకు వివరించారు. మళ్లీ ఇదే రోజున కరోనా ట్రీట్మెంట్ చేయవద్దంటూ ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. డబ్బులున్న వాళ్లు ప్రైవేట్ హాస్పిటళ్లలో ట్రీట్మెంట్చేయించుకుంటే తప్పేం ఉందని సర్కారును ప్రశ్నించింది. తమకు నచ్చిన చోట, ఇష్టమైన చోట ట్రీట్మెంట్ చేయించుకునే హక్కు పౌరులకు ఉందని స్పష్టం చేసింది. ‘‘ప్రభుత్వ హాస్పిటళ్లలోనే ట్రీట్మెంట్ చేయించుకోవాలనడం రాజ్యాంగ విరుద్ధం. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు కూడా విరుద్ధం. జీవించే హక్కు, ఆరోగ్యం రెండూ కూడా ప్రాథమిక హక్కులే అవుతాయి. ప్రైవేట్ హాస్పిటళ్లలో కరోనా టెస్టులు, ట్రీట్మెంట్ చేయరాదని చెప్పడానికి ప్రభుత్వం సరైన కారణాలు చూపలేకపోయింది.
కరోనా టెస్టులు, ట్రీట్మెంట్, ఐసోలేషన్ సర్కారీ ఆస్పత్రుల్లోనే చేయించుకోవాలనడం చెల్లదు. ఖర్చు చేసుకునే స్తోమత ఉన్నవాళ్లకు ప్రైవేటు హాస్పిటళ్లలో ట్రీట్మెంట్ చేయించుకునే హక్కుంది. ఐసీఎంఆర్ నిబంధనలకు అనుగుణంగా ప్రైవేటు హాస్పిటళ్లు, ల్యాబ్లకు అనుమతి ఇవ్వాలి. వాటి పనితీరును పర్యవేక్షించాలి. ఇందుకోసం గైడ్లైన్స్ జారీ చేయాలి. కేంద్ర, రాష్ట్ర, ఐసీఎంఆర్ మార్గదర్శకాలు అమలు జరిగేలా చూడాలి. ట్రీట్మెంట్ చేయించుకునే వారి వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. కరోనాను అంతం చేయాలంటే ప్రభుత్వ వైద్య సేవలతోపాటు ప్రైవేట్ హాస్పిటళ్ల సహకారం కూడా అవసరమనే విషయాన్ని మర్చిపోకూడదు’’ అని బెంచ్ పేర్కొంది. సర్కార్ నియంత్రణ పరిమితంగా, హేతుబద్ధంగా ఉండాలని స్పష్టం చేసింది. ప్రైవేట్ హాస్పిటళ్లు, ల్యాబ్స్పై ప్రభుత్వానికి నమ్మకం లేకపోతే ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదల వైద్య సేవలకు ఎలా అనుమతిచ్చారని ప్రశ్నించింది. కరోనా ట్రీట్మెంట్ కోసం ప్రైవేటు హాస్పిటళ్లు, ల్యాబ్లు ఐసీఎంఆర్కు దరఖాస్తు చేసుకోవాలని, అక్కడి నుంచి ఆమోదం వచ్చిన వాటికి సర్కారు పర్మిషన్లు ఇవ్వాలని స్పష్టం చేసింది.