
హైదరాబాద్, వెలుగు: సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు కొట్టివేస్తూ మంగళవారం తీర్పు చెప్పింది.. ఎలాంటి ఆధారాల్లేకుండా ఎలక్షన్ పిటిషన్ దాఖలు చేశారని పిటిషనర్ జి.చక్రధర్ గౌడ్ను తప్పుపట్టింది. హరీశ్రావు ఎన్నికల నామినేషన్ సమయంలో తప్పుడు అఫిడవిట్ వేశారన్న ఆరోపణలకు సరైన సాక్ష్యాలు చూపలేదని తేల్చింది. ఆరోపణలకు ఆధారాలు చూపలేదని పేర్కొంది. ఆధారాలు సమర్పించకుండా, వివరాలు ఇవ్వకుండా ఎలక్షన్ పిటిషన్ వేశారని తీర్పులో పేర్కొంది.
విచారణ తొలి దశలోనే ఈపీని కొట్టివేయాలంటూ హరీశ్రావు మధ్యంతర అప్లికేషన్ వేశారు. వీటిపై జస్టిస్ కాజా శరత్ విచారణ పూర్తి చేసి మంగళవారం జడ్జిమెంట్ చెప్పారు. గతేడాది జనవరి 10న చక్రధర్ గౌడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని, ఎన్నికల అధికారులకు వినతి పత్రం మాత్రం సెప్టెంబరు 30న సమర్పించారని, ఈపీ వేశాకే ఈసీకి ఫిర్యాదు చేశారని న్యాయమూర్తి తన తీర్పులో తప్పుపట్టారు. పోలింగ్ జరిగిన రోజు సాయంత్రం 4.05 గంటలకు 45 శాతమే మాత్రమే పోలింగ్ ఉంటే దానిని హరీశ్ ఆదేశాలతో ఒక్క గంటలో అది కాస్తా 85 శాతానికి పెరిగిపోయిందని పిటిషనర్ ఆరోపణలకు ఆధారాలైన గంటలవారీ పోలింగ్ వివరాలు ఇవ్వట్లేదని తప్పుపట్టారు.
క్రిమినల్ కేసుల వివరాలను హరీశ్రావు తొక్కిపెట్టారనే ఆరోపణలు వాస్తవం కాదని, ఆయన ఎన్నికల అఫిడవిట్లో వివరాలు ఉన్నాయని తెలిపారు. మిట్టపల్లి రెవెన్యూ గ్రామంలో సర్వే నం1037లోని వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా చూపి తప్పుదారి పట్టించారంటూ ధరణి పోర్టల్లోని వివరాలకు ధ్రువీకరణ లేకుండా ఆరోపణ చేశారన్నారు. ఈపీలో చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపనందున పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు, హరీశ్ వేసిన మధ్యంతర పిటిషన్ను ఆమోదిస్తున్నట్లు న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు.