హైదరాబాద్, వెలుగు: గోల్కొండ, కుతుబ్షాహీ టూంబ్స్ సహా 27 చారిత్రక కట్టడాల సంరక్షణకు సంబంధించి రీ డెవలప్మెంట్ ప్లాన్ను 6 వారాల్లోగా సమర్పించాలని రాష్ట్ర సర్కార్ను హైకోర్టు ఆదేశించింది. 6 నెలల గడువు కావాలన్న ప్రభుత్వ వినతిని తోసిపుచ్చింది. చారిత్రక, పురాతన కట్టడాల సంరక్షణకు పర్యాటక శాఖ తీసుకున్న చర్యలతోపాటు తమ ఆదేశాలతో ఏర్పాటైన కమిటీ కట్టడాలను పరిశీలించి వాస్తవ పరిస్థితులతోపాటు వాటి రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రతిపాదనలను అందజేయాలని చెప్పింది. ఈమేరకు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ చీఫ్ జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ విజయ్సేన్రెడ్డిల డివిజన్ బెంచ్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది వర్షాలకు గోల్కొండ కోట మట్టిగోడలు కరిగిపోయాయని, కోట రాళ్లు ఒరిగి బీటలు వారాయని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో చారిత్రక కట్టడం దీనావస్థకు చేరిందని ఒక పత్రికలో వచ్చిన స్టోరీని హైకోర్టు పిల్గా భావించి విచారణ చేపట్టింది.