ఆన్ లైన్ క్లాసుల వల్ల ఎలాంటి న్యాయం జరుగుతుంది?: హైకోర్టు

ఆన్ లైన్ క్లాసుల వల్ల ఎలాంటి న్యాయం జరుగుతుంది?: హైకోర్టు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంవత్సరం ప్రారంభం కాలేదని హైకోర్టుకు తెలిపింది ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలలు ఆన్ లైన్ లో తరగతుల నిర్వహణపై శుక్రవారం నాడు హైకోర్టు విచారించింది. రాష్ట్రంలో ఇంకా విద్యాసంవత్సరం ప్రారంభం కాని విషయాన్ని అడ్వకేట్ జనరల్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆన్ లైన్ క్లాసులపై హైకోర్టుకు ‌ప్రభుత్వం ఎలాంటి నివేదికను సమర్పించలేదు. ఆన్ లైన్ క్లాసుల నిర్వహణకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటి తుది నిర్ణయం తీసుకొంటుందని హైకోర్టుకు ప్రభుత్వం వివరించింది.

నిర్ణయం తీసుకోనప్పుడు ఆన్ లైన్ క్లాసులు ఎందుకు నిర్వహిస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది.ఈ తరహా ఆన్ లైన్ క్లాసుల వల్ల పేద విద్యార్థులకు ఎలాంటి న్యాయం జరుగుతోందని హైకోర్టు ప్రశ్నించింది.దీనిపై ఈనెల 13వ తేదీన నిర్దిష్ట ప్రణాళికను లిఖిత‌పూర్వ‌కంగా కోర్టుకు సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఆన్ లైన్ క్లాస్ పిటీషన్ లో (ఇస్మా) ఇండిపెండెంట్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసింది. CBSC మార్గదర్శకాలకు అనుగుణంగా గత రెండు నెలల క్రితమే విద్యా సంవత్సరం ప్రారంభించామని ఇస్మా తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.ఆన్లైన్ క్లాసుల వలన తల్లిదండ్రులపై ఎలాంటి ఒత్తిడి చేయడం లేదని కోర్టుకు తెలిపారు. ఆన్ లైన్ క్లాసులు తల్లిదండ్రులకు ఆప్షన్ మాత్రమే అని తెలిపారు. CBSC పై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ లేదని కోర్టుకు తెలుప‌గా… పూర్తి వివరాలు కౌంటర్ దాఖలు చేయాలంటూ ఇస్మా కు హైకోర్టు అదేశమిచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 13 కు వాయిదా వేసింది.

high court hearing on online classes in private schools in telangana