హైదరాబాద్, వెలుగు: ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ని విగ్రహాల తయారీలో మాత్రమే నిషేధించడం ఏమిటని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్ట్ ప్రశ్నించింది. పీవోపీ వాడకంపై పూర్తి స్థాయిలో ఎలా నిషేధం విధిస్తారని వివరణ కోరింది. పీవోపీని నిషేధించడం కంటే ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా విగ్రహాల ఎత్తుపై ఆంక్షలతో కూడిన నిషేధం విధిస్తే ఫలితం ఉంటుందని సూచించింది. పీవోపీ నిషేధ ఉత్తర్వులపై వివరణ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పొల్యూషన్ కంట్రోల్ బోర్డులతోపాటు జీహెచ్ ఎంసీలను కోర్ట్ ఆదేశించింది.
పీవోపీ నిషేధ ఉత్తర్వులను సవాల్ చేస్తూ తెలంగాణ గణేష్ మూర్తి కళాకారుల వెల్ఫేర్ అసోసియేషన్, కొవిడ్కు ముందు మిగిలిపోయిన వినాయక విగ్రహాల అమ్మకాలకు వీలుగా జీహెచ్ఎంసీకి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన 2 రిట్లపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. కేసు తదుపరి విచారణను ఈ నెల 21న జరుపుతామని చీఫ్ జస్టిస్ తెలిపారు.