హైదరాబాద్, వెలుగు: శిశువిహార్లో నెలల పసికందును తల్లి వదిలేసిన ఘటనలో ఆ బిడ్డను తండ్రికి అప్పగించాలని హైకోర్టు ఆదేశించింది. పంజాబ్కి చెందిన సచిన్ కుమార్ యాదవ్, హైదరాబాద్కు చెందిన సైదా సరన్ తబస్సుమ్ 2020 జులైలో పెళ్లి చేసుకున్నారు. తర్వాత వీరికి ఒక బాబు పుట్టాడు. ఇద్దరి మధ్య గొడవలు రావడంతో 2023లో విడాకులు తీసుకున్నారు. 45 రోజుల వయసు ఉన్న బాబును హైదరాబాద్ అమీర్పేట్లోని శిశువిహార్లో తల్లి వదిలిపెట్టింది. ఈ విషయం తెలుసుకున్న తండ్రి తన కొడుకును అప్పగించాలని హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు.
దీనిపై జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ పి.శ్రీసుధ డివిజన్ బెంచ్ విచారణ జరిపి ఇటీవల తీర్పు వెలువరించింది. అనారోగ్యం కారణంగా బాబు బాధ్యతలు తాను చూసుకోలేనని తల్లి చెప్పింది. బిడ్డను తీసుకెళ్లాలని తండ్రిని కోరినా అతను తీసుకెళ్లలేదని కోర్టుకు తెలిపింది. అందుకే బాబును శిశువిహార్కు అప్పగించినట్లు భార్య చెప్పింది. కాగా, భార్య, భర్తలు విడాకులు తీసుకోవడంతో భవిష్యత్తులో బిడ్డపై ఎలాంటి హక్కులు కోరబోనని భార్య ఒప్పందంలో సంతకం చేసింది. ఈ నేపథ్యంలో బిడ్డను తండ్రికి అప్పగించాలని జిల్లా సంక్షేమ అధికారిని హైకోర్టు ఆదేశించింది.