హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపుపై స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి? ఎన్ని డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించారు? ఎన్ని ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించారు? తదితర వివరాలని చెప్పాలని కోరింది. మూడు వారాల తర్వాత జరిగే విచారణ నాటికి సమగ్ర వివరాలతో రిపోర్టు ఇవ్వాలని గురువారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. డబుల్ బెడ్రూం ఇండ్లను అర్హులైన వారికి కేటాయించకపోవడాన్ని సవాల్ చేస్తూ బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లు ఇంద్రసేనారెడ్డి దాఖలు చేసిన పిల్ను గురువారం చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ టి వినోద్ కుమార్లతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది.
దీనిపై ప్రభుత్వ స్పెషల్ ప్లీడర్ హరేందర్ పరిషద్ వాదిస్తూ, 2021లో పిల్ దాఖలయ్యేనాటికి రాష్ట్రంలో 1,00,087 ఇండ్లకుగాను.. 12,656 ఇండ్ల నిర్మాణం జరిగి కేటాయింపులు కూడా జరిగాయన్నారు. ఈ ఏడాది ఆగస్టు 1 నాటికి 1,43,544 ఇండ్లకుగాను.. 65,658 ఇండ్ల కేటాయింపు జరిగిందన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రత్యేక డ్రైవ్ కింద 65,658 ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు తెలిపారు. వీటిని దశల వారీగా మూడు నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. పిటిషనర్ అడ్వొకేట్టి సృజనకుమార్ రెడ్డి వాదిస్తూ.. ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు క్షేత్రస్థాయిలోని వాస్తవ పరిస్థితులకు పొంతన లేదన్నారు. దీంతో పెండింగ్లో ఉన్న అప్లికేషన్ల వివరాలు కూడా ఇవ్వాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ లెక్కలు వాస్తవ పరిస్థితులు వ్యత్యాసం ఉంటే దానిపై అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్ను ఆదేశించింది. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.