హైదరాబాద్, వెలుగు: హ్యూమన్రైట్స్ కమిషన్ చైర్మన్, మెంబర్లను ఎందుకు నియమించడం లేదని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కాలయాపన చేయడంపై ఫైర్ అయింది. రాష్ట్ర సర్కారు మానవ హక్కుల కమిషన్ చైర్మన్, సభ్యులను నియమించకపోవడాన్ని తప్పుపడుతూ సికింద్రాబాద్కు చెందిన అద్నాన్ మహమూద్ దాఖలు చేసిన పిల్ను చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీతో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం విచారించింది.
2022, డిసెంబరు 22 నుంచి కమిషన్కు చైర్మన్, సభ్యులు లేరని పిటిషనర్ లాయర్ చెప్పారు. గతంలో కూడా ఇట్లనే పిల్ వేశాకే ప్రభుత్వం వారిని నియమించిందన్నారు. గవర్నమెంట్ స్పెషల్ ప్లీడర్ హరేందర్ ప్రతివాదన చేస్తూ, 2 వారాల గడువు కావాలని కోరారు. పదేపదే వాయిదాలు కోరితే సీఎస్కు సమన్లు జారీ చేయాల్సి ఉంటుందని హైకోర్టు హెచ్చరించి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.