
- హెచ్ఎం మృతిపై ప్రభుత్వ తీరును ప్రశ్నించిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: ప్రధానోపాధ్యాయుడిగా పదవీ విరమణ చేసిన తరువాత అందాల్సిన ఆర్థిక ప్రయోజనాలను సకాలంలో అందించకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. రిటైర్ మెంట్ తర్వాత ఆర్థిక ప్రయోజనాలు అందక ఒక హెచ్ఎం మనోవేదనతో మృతిచెందారని, ఆ పరిస్థితి ఎందుకు ఎదురైందన్నదానిపై పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జిల్లా ఉన్నత పరిషత్ బాలికల పాఠశాల హెచ్ఎంగా కూరపాటి పాండురంగయ్య పదవీ విరమణ చేసి ఏడాది అయినా రిటైర్మెంట్బెనిఫిట్స్ అందలేదు.
ప్రభుత్వం నుంచి బకాయిల కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకపోవడంతో వాటి కోసం ఎదరుచూస్తూ మనోవేదనతో మృతిచెందారని ఓ పత్రికలో ప్రచురితమైన కథనాన్ని హైకోర్టు సుమోటోగా విచారణను స్వీకరించింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ యారా రేణుకతో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆర్థిక శాఖ, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శులు, విద్యాశాఖ కమిషనర్, అకౌంటెంట్ జనరల్ తదితరులకు
నోటీసులు జారీ చేస్తూ విచారణను జూన్కు వాయిదా వేసింది.