హైదరాబాద్, వెలుగు: బేగంపేట లోని గ్రీన్ల్యాండ్ గెస్ట్ హౌస్ దగ్గరున్న 3,500 గజాల జాగా ప్రైవేట్ వ్యక్తులదేనని హైకోర్టు తీర్పు చెప్పింది. సర్వే నెం 214/1లోని స్థలం రాష్ట్ర సర్కారుది కాదని డాక్టర్ చంద్ర రేఖ విగ్ హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ ను జస్టిస్ పి మాధవీదేవి విచారించారు. సివిల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు స్థలం హక్కులపై తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని, అయినా ఆ స్థలంలో రాష్ట్రం జోక్యం చేసుకుంటోందని పిటిషనర్ తరుపు అడ్వకేట్ వాదించారు.
విచారణ అనంతరం కోర్టు స్పందిస్తూ..ఆ స్థలం రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఎలాంటి ఆధారాలు లేవని తెలిపింది. అది పిటిషనర్లకు వారి పూర్వీకుల నుంచి వచ్చిన జాగా అని వెల్లడించింది. కింది కోర్టు ఉత్తర్వుల మేరకు పిటిషనర్కు సదరు స్థలంపై హక్కులు ఉన్నాయని తేల్చినట్లు వివరించింది. అందువల్ల 3,500 గజాల జాగా ప్రైవేట్ వ్యక్తులదేనని స్పష్టం చేస్తూ తీర్పు వెలువరించింది.