హైదరాబాద్, వెలుగు: సినీ డైరెక్టర్ శంకర్కు రాష్ట్ర ప్రభుత్వం తగిన ధరకు భూమి కేటాయించడంలో తప్పేంటని హైకోర్టు ప్రశ్నించింది. భూ కేటాయింపుల విషయంలో ప్రభుత్వానికి ఒక విధానం ఉంటుందని, అందులో భాగంగానే సినీ డైరెక్టర్లు, క్రీడాకారులకు భూమి ని కేటాయిస్తారని చెప్పింది. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం మోకిల్లా గ్రామంలో సర్వే నంబర్ 8లోని ఎకరం రూ.5 లక్షల చొప్పున ఐదెకరాలను శంకర్కు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ కరీంనగర్కు చెందిన జె.శంకర్ 2020లో పిల్ దాఖలు చేశారు. దీనిని బుధవారం చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీ బెంచ్ విచారణ చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 7న తీర్పు వెలువరిస్తామని తెలి పింది. పిటిషనర్ తరఫు సీనియర్ లాయర్ సత్యం రెడ్డి వాదిస్తూ, ఈ మధ్య కాలంలో సినిమాల నిర్మాణాలన్నీ స్టూడియోల్లో కాకుండా, ఔట్డోర్లోనే జరుగుతున్నాయని, అలాంటప్పుడు ప్రభుత్వ భూమిని తక్కువ ధరకు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు.
శంకర్ తరఫు లాయర్ శ్రీరఘురామ్ వాదిస్తూ, ప్రతిభ ఉండి ఆర్థిక స్థోమత లేకపోవడం వల్లే శంకర్ స్టూడియోను నిర్మించలేకపోయారన్నారు. డైరెక్టర్ శంకర్కు ఇచ్చే భూమిని వ్యక్తిగతంగా వాడుకోరన్నారు. స్టూడియో నిర్మాణం చేస్తారని తెలిపారు. ప్రభుత్వం తరఫున ఏజీ బీఎస్ ప్రసాద్ వాదిస్తూ, బీసీ వర్గానికి చెందిన శంకర్కు భూమి కేటాయింపు సమర్థనీయమేనని పేర్కొన్నారు. 40 ఏండ్లుగా చిత్ర పరిశ్రమలో శంకర్ ఉన్నారని, తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన పాల్గొన్నారని చెప్పారు. సినిమా పరిశ్రమ అభివృద్ధికి, ఉద్యోగ కల్పనకు దోహదపడేలా భూమిని కేటాయించామని తెలిపారు.