- చర్యలు ఎందుకు తీసుకోలేదోకోర్టుకు వచ్చి చెప్పండి
- డిస్కమ్ అధికారుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్లోని గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ (గీతం) యూనివర్సిటీ 2008–09 నుంచి ఇప్పటి వరకు విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వర్సిటీ రూ.118.13 కోట్ల మేర విద్యుత్ బకాయి ఉంటే డిస్కం ఆఫీసర్లు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది. అదే సామాన్యుడు రూ.118 విద్యుత్ బిల్లు చెల్లించకుంటే నోటీసు కూడా ఇవ్వకుండా కనెక్షన్ కట్ చేసే ఆఫీసర్లు.. గీతం వర్సిటీపై ఎందుకు ప్రేమ చూపుతున్నారని నిలదీసింది. పెండింగ్ విద్యుత్ బకాయిలను చెల్లించాలని డిస్కమ్ జారీ చేసిన నోటీసులను గీతం వర్సిటీ సవాల్ చేసిన పిటిషన్పై మంగళవారం విచారణ కొనసాగింది.
విచారణ సందర్భంగా గీతం వర్సిటీ రెండు దశాబ్దాలుగా (2008–09 ఆర్థిక సంవత్సరం నుంచి) విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడాన్ని జస్టిస్ నగేష్ భీమపాక తీవ్రంగా పరిగణించారు. తన చిన్నతనంలో ఇంటి విద్యుత్ బిల్లు రూ.800 వస్తే చెల్లించలేదని చెప్పి విద్యుత్ సప్లయ్ ఆపేశారని గుర్తు చేసుకున్నారు. గీతం వర్సిటీ విద్యుత్ సరఫరాను ఎందుకు నిలిపివేయలేదో వివరణ ఇచ్చేందుకు టీజీపీసీడీఎల్, సంగారెడ్డి సర్కిల్, సూపరింటెండింగ్ ఇంజనీర్ స్వయంగా విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.
సూపరింటెండింగ్ ఇంజనీర్ ఈ ఏడాది సెప్టెంబర్లో నోటీసులు జారీ చేశారని, విద్యుత్ బకాయిలను చెల్లించకపోతే సరఫరాను నిలిపివేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారని డిస్కమ్ స్టాడింగ్ కౌన్సిల్ ఎన్.శ్రీధర్రెడ్డి కోర్టు దృష్టికి తెచ్చారు. ఇదే తరహా నోటీసును కూడా 2020లో వర్సిటీ హైకోర్టులో సవాలు చేసిందని, స్టే ఆదేశాలు వెలువడ్డాక పిటిషన్ను వాపస్ తీసుకున్నదని చెప్పారు. విద్యుత్ బకాయి రూ.118.13 కోట్లకు చేరిందన్నారు. నోటీసు ఏకపక్షమని, చట్టవిరుద్ధమని ప్రకటించాలని గీతం వర్సిటీ యాజమాన్యం తరఫు న్యాయవాది వాదించారు. విచారణను కోర్టు ఈ నెల 22కు వాయిదా వేసింది.
